పెగాసస్ వంటి మాల్వేర్ల నుంచి రక్షణ
డాటాకు ముప్పు ఉందనుకునే వారికే..
ఫీచర్ను అందుబాటులోకి తెచ్చిన యాపిల్
వాషింగ్టన్, జూలై 7: పెగాసస్ వంటి స్పైవేర్లు ఎంత ప్రమాదకరమో మనకు తెలిసిందే. దేశాధినేతలే దీని బారిన పడ్డారు. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేసేందుకు ఈ పెగాసస్ను ప్రభుత్వాలు వాడుకున్నాయన్న ఆరోపణలు సంచలనం రేపాయి. అయితే పెగాసస్ వంటి ప్రమాదకరమైన స్పైవేర్ల నుంచి మీ ఫోన్లలోని డాటాను కాపాడుకోవాలనుకునే వారి కోసం యాపిల్ సంస్థ ప్రత్యేకంగా సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ మ్యాక్లలో ‘లాక్డౌన్’ మోడ్ను ప్రవేశపెట్టినట్టు గురువారం ప్రకటించింది. ఫోన్లలో ఉన్న డాటాకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందనుకునే వారికి ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొన్నది. అందరికీ ఈ ఫీచర్ అవసరం ఉండబోదని కూడా తెలిపింది. ఈ ఫీచర్ను వినియోగించుకోవడం పూర్తిగా వినియోగదారుడి ఇష్టమని వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీలో పరిశోధనల కోసం రూ.80 కోట్ల మేర నిధులు కేటాయించినట్టు వివరించింది.
ఎలా పనిచేస్తుంది?
ఈ లాక్డౌన్ మోడ్ ద్వారా పెగాసస్ వంటి స్పైవేర్ల నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని యాపిల్ చెబుతున్నది. ఫోన్లలో లాక్డౌన్మోడ్ ఆన్ చేసుకుంటే ఫోన్ లో చాలా యాప్స్ పనితీరు తగ్గిపోతుందని పేర్కొంటున్నది. ముఖ్యంగా మెసేజ్లు, వెబ్ బ్రౌజింగ్, ఫేస్టైం, కాల్స్కు యాక్సెస్ బ్లాక్ అవుతుందని వివరించింది. కంప్యూటర్లు తదితర పరికరాలకు అనవసర సందర్భాల్లో కనెక్షన్ కట్ అవుతుందని తెలిపింది.
వేటిలో పనిచేస్తుంది?
ఐవోఎస్ 16, ఐపాడ్ ఓఎస్ 16, మాక్ ఓఎస్ వెంచురా వెర్షన్లలో మాత్రమే లాక్డౌన్ మోడ్ ఫీచర్ పనిచేస్తుంది. పాత వెర్షన్లు అయిన ఐఫోన్ 7, ఐఫోన్ 6ఎస్ వంటి వెర్షన్లలో పనిచేయదు.