లండన్, సెప్టెంబర్ 5: బ్రిటన్ కొత్త ప్రధానిగా, కన్జర్వేటివ్ పార్టీ నేతగా లిజ్ ట్రస్ (47) విజయం సాధించారు. భారత సంతతికి చెందిన రిషి సునక్పై దాదాపు 21 వేల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ప్రధాని ఎన్నికల్లో లిజ్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న సర్వేల అంచనాలను నిజం చేస్తూ ఆమె ఈ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించారు. మార్గరేట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ ప్రధాని పగ్గాలు చేపట్టబోతున్న మూడో మహిళగా లిజ్ రికార్డు సృష్టించారు. లిజ్ ప్రస్తుతం బ్రిటన్ విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు గడిచిన ఆరు వారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారంతో పాటు పార్టీలో అంతర్గతంగా పోలింగ్ జరగ్గా.. సోమవారం తుది ఫలితాలు వెలువడ్డాయి.
నాడు తనకు తాను ఓటు వేసుకోలేదు
దాదాపు 40 ఏండ్ల కిందట పాఠశాలలో నిర్వహించిన ఓ నాటకంలో ఓ బాలిక మార్గరేట్ థాచర్ పాత్ర పోషించింది. ఆ నాటికలో ఉత్తుత్తి ఎన్నికలు నిర్వహించారు. అందులో ఆ బాలికకు ఒక్క ఓటు కూడా రాలేదు. తనకు కూడా తాను ఓటు వేసుకోలేదు. ఆ బాలికే నేడు బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్లో వామపక్ష భావజాలం ఉన్న కుటుంబంలో 1975లో లిజ్ జన్మించారు. డిగ్రీ చదివి అకౌంటెంట్గా పనిచేశారు. 2001 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2005లోనూ మరోమారు ఓడిపోయారు. అయినప్పటికీ, నిరుత్సాహపడకుండా 2010లో మరోసారి బరిలో దిగి విజయం సాధించారు. కామెరూన్, థెరిసా, బోరిస్ ప్రభుత్వాల్లో కీలక పదవులు చేపట్టారు.
కెనడాలో కత్తులతో దాడి
రెజీనా (కెనడా), సెప్టెంబర్ 5: కెనడాలోని పలుచోట్ల కత్తుల దాడి జరిగింది. వరుసగా జరిగిన దాడుల్లో 10 మంది మరణించగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జేమ్స్ స్మిత్ క్రీ నేషన్, వెల్డన్ గ్రామంతో పాటు ఈశాన్య సస్కచేవన్ టౌన్లో ఈ దాడులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. ఒక వర్గం వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కొన్ని చోట్ల ఈ దాడులు జరుగగా, మరికొన్ని చోట్ల కనిపించిన వారిపై కత్తితో దుండగులు దాడిచేశారు. దాదాపు 13 ప్రాంతాల్లో కత్తిదాడుల్లో మరణించిన వారి మృతదేహాలు, క్షతగాత్రులను గుర్తించారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.