Instagram | న్యూయార్క్, మార్చి 17: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్పార్మ్లను నిర్వహిస్తున్న మెటా సంస్థపై లొట్టె రుబీక్ అనే సైకాలజిస్ట్ సంచలన ఆరోపణలు చేశారు. మెటా సంస్థ యూజర్ల శ్రేయస్సు కంటే ఆదాయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని ఆమె ఆరోపించారు. గత మూడేండ్లుగా మెటా సంస్థ నిపుణుల బృందంలో పని చేసిన లొట్టె రుబీక్.. ఆత్మహత్యల నివారణ, హానికర కంటెంట్పై సలహాదారుగా వ్యవహరించారు.
అయితే, ఇన్స్టాగ్రామ్లో ఉన్న హానికర కంటెంట్ను తొలగించాలని తాను చేసిన సూచనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆమె తన పదవికి రాజీనామా చేశారు. యువతులు, ఆడపిల్లలపై ప్రభావం చూపుతున్న, ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్న కంటెంట్పై మెటా సంస్థ ఉదాసీనతతో వ్యవహరిస్తున్నదని ఆమె ఆరోపించారు. మరోవైపు మెటా ప్లాట్ఫార్మ్లలో అక్రమంగా మాదకద్రవ్యాల అమ్మకాలు జరుగుతున్నాయని అమెరికా దర్యాప్తు సంస్థలు మెటాపై విచారణ ప్రారంభించినట్టు వాల్స్ట్రీట్ జర్నల్లో ఒక కథనం ప్రచురితమైంది.