ఇస్లామాబాద్: పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు ఆమిర్ హమ్జాపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటన లాహోర్లో జరిగింది. ప్రస్తుతం అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఉగ్రవాది హఫీజ్ సయిద్తో కలిసి 1985లో లష్కరే తోయిబాను హమ్జా స్థాపించారు. ఇండియాలో జరిగిన అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు అతనికి లింకులు ఉన్నాయి. హఫీజ్ సయీద్ తర్వాత హమ్జా లష్కరే గ్రూపులో రెండో కీలక వ్యక్తిగా ఎదిగారు. హమ్జాను ఉగ్రవాదిగా అమెరికా ముద్రవేసింది. లాహోర్లో ఉన్న ఓ న్యూస్ ఛానల్ ఆఫీసు ఆవరణలో అతనిపై కాల్పులు జరిపారు.
1959లో ఆమిర్ హమ్జా జన్మించారు. అతను మాజీ ఆఫ్ఘన్ ముజాయిదిన్. లష్కరే ఐడియాలజీలో కీలక వ్యక్తి అతను. అతని వయసు 66 ఏళ్లు. చాలా ధాటిగా అతను మాట్లాడగలడు, రాయగలడు. టెర్రర్ గ్రూపుకు చెందిన ఓ పబ్లికేషన్ను అతను ఎడిట్ చేస్తాడు. అనేక పుస్తకాలు రాశాడతను. ఖాఫిలా దావత్, షాహదత్ బుక్స్ అతనే రాశాడు. 2018 నుంచి లష్కరేతో హమ్జా దూరంగా ఉంటున్నాడు. లష్కరే ఫండింగ్ పై ప్రభుత్వం నిఘా పెట్టడంతో అతను తన కార్యకలాపాలను తగ్గించుకున్నాడు. ఆ తర్వాత అతను జైషే మన్కాఫా సంస్థను స్థాపించాడు. దాని ద్వారా లష్కరే కోసం ఫండ్స్ సేకరించాడు. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఆ డబ్బును వాడేవాడు.