బండ్లగూడ, మే 6: రాజేంద్రనగర్ పరిధిలో ఓ చిన్నారి హత్య ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఆడుకుంటున్న ఆ చిన్నారి క్షణాల వ్యవధిలోనే విగతజీవిగా మారింది. తల్లి వచ్చి చూసే సరికి కన్నుమూసింది. ఆ మూడేండ్ల చిన్నారిని గొంతు నులిమి హత్య చేశారని వైద్యులు నిర్ధారించడం కలకలం రేపుతున్నది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్లో నివాసం ఉండే శ్రీనివాస్, సాయిలత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ ఉబర్ బైక్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ఇదిలా ఉంటే గురువారం ఉదయం సాయిలత తన కూతురి (3)ని ఇంట్లో పడుకోబెట్టి బట్టలు ఆరవేసేందుకు ఇంటిపైకి వెళ్లి వచ్చింది. ఆ తర్వాత చిన్నారిని పరిశీలించగా ఊపిరి ఆడటం లేదని గుర్తించి వెంటనే నిలోఫర్ దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం గొంతు నులిమి చంపినట్లుగా ఉందని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.