Ukraine : ఉక్రెయిన్ రాజధాని కీవ్లో జరిగిన కాల్పుల ఘటనలో ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్పందించారు. నిందితుడిని పోలీసులు కాల్చి చంపినట్లు వెల్లడించారు. ఈ ఘటన శనివారం జరిగింది. చేతిలో గన్ కలిగిన ఒక దుండగుడు కీవ్లోని వీధుల్లో సాధారణ పౌరులపైకి కాల్పలు జరిపాడు. ఈ కాల్పుల కారణంగా రక్తస్రావం జరిగి ఆరుగురు మరణించారు.
మరో 10 మంది వరకు గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ, దుండగుడు అక్కడివారిలో నలుగురిని బంధీలుగా తీసుకున్నాడు. స్థానిక సూపర్ మార్కెట్లోకి వెళ్లి, బంధీలను అడ్డం పెట్టుకుని తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులకు, దుండగుడికి మధ్య కాల్పులు జరిగాయి. కానీ, పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు మరణించాడు. అనంతరం పోలీసులు బంధీలను విడిపించారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక, కాల్పులకు పాల్పడిన దుండగుడి గురించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. అలాగే, ఈ కాల్పుల ఘటనకు కారణాలు కూడా తెలియలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరుపుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.