ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. సామాన్య పౌరులు కూడా మృతి చెందుతున్నారు. ఖార్కీవ్పై రష్యా చేసిన దాడిలో భారతీయ విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కీవ్, ఖార్కీవ్లో బాంబుల మోత మోగిపోతోంది. క్షిపణి దాడులు, పెద్ద పెద్ద బాంబు పేలుళ్లతో ఈ రెండు ప్రధాన నగరాలు దద్దరిల్లుతున్నాయి. మంగళవారం రోజే పుతిన్ సేనలు ఖార్కీవ్లోని ప్రభుత్వ కార్యాలయంపై క్షిపణి దాడులు చేసిందని వార్తలొస్తున్నాయి. అయితే.. ఈ రెండు ప్రధాన నగరాలు ఇప్పుడే బాంబుల మోతలు, క్షిపణుల దాడులను చూస్తున్నాయా? గతంలోనూ ఇలాంటి వాటిని చూశాయా?
రెండో ప్రపంచ యద్ధ సమయంలోనూ ఇంతేనట…
నియంత హిట్లర్ నేతృత్వంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనూ ఈ రెండు నగరాలు ఇలాంటి పరిస్థితినే చవి చూశాయట. ఈ విషయాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. 1941 లో కూడా కీవ్, ఖార్కీవ్ నగరాలపై బాంబుల వర్షం, బాంబుల పేలుళ్లతో దద్దరిల్లింది. 1941 నవంబర్ మాసంలో జర్మనీ దళాలు కీవ్లోకి ప్రవేశించి దాదాపు 30 వేల మంది జూస్లను ఊచకోత కోశాయి. ఆ తర్వాత కూడా జర్మన్ అధికారులు కొన్ని వేల మందినే చంపేశారని రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే జర్మనీ సైన్యం కీవ్ను స్వాధీనం చేసుకున్నాయి.