లండన్: రెండవ క్వీన్ ఎలిజబెత్ మృతి పట్ల ప్రపంచ దేశాధినేతలు నివాళి అర్పించారు. క్వీన్ తన విధులను ఎంతో గౌరవంగా నిర్వహించినట్లు గుర్తు చేసుకున్నారు. ఆమె మంచితనం, ఆమె హాస్యాన్ని కూడా ప్రపంచ దేశాధినేతలు ప్రశంసించారు. క్వీన్ ఎలిజబెత్ మంచి మనసుకున్న రాణి అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్ తెలిపారు. ఫ్రాన్స్కు ఆమె మంచి స్నేహితురాలు అని ఆయన అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రియాక్ట్ అవుతూ.. ప్రపంచ దేశాలను ఆమె ఆకర్షించిందని అన్నారు. దయ, గాంభీర్యం, అవిశ్రాంత పనితనంతో ఆమె ఆకట్టుకున్నట్లు ఒబామా తెలిపారు.
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా నివాళి అర్పించారు. 40 ఏళ్ల క్రితమే క్వీన్ ఎలిజబెత్ను బైడెన్ తొలిసారి కలిశారు. ఆమె మహారాణి కన్నా ఎక్కువ అని, ఓ శకం ఆమెదే అని ఆయన అన్నారు. 2021లో బ్రిటన్ టూర్ను బైడెన్ గుర్తు చేసుకున్నారు. తన చమత్కారంతో రాణి ఆకట్టుకున్నారని, తన దాయా హృదయంతోనూ, ఉదారస్వభావంతో తన గొప్పతనాన్ని చాటుకున్నట్లు ఆయన అన్నారు. క్వీన్ ఎలిజబెత్ తన జీవితకాలంలో 13 మంది దేశాధ్యక్షులను కలుసుకున్నారు.
రాణి స్నేహాన్ని, అమోఘ జ్ఞానాన్ని, అద్భుతమైన హాస్య చతురతును ఎప్పటికీ మరిచిపోలేమని మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆమె ఓ బ్యూటిఫుల్ లేడీ అని, ఆమె లాంటి వాళ్లు మరొకరు లేరని ట్రుత్ సోషల్ సైట్లో ట్రంప్ పేర్కొన్నారు. క్వీన్ తెలివైందని, హాషారైందని, చమత్కారం అద్భుతమని మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ తెలిపారు.
ప్రపంచంలో నాకు ఫెవరేట్ వ్యక్తి అమె అని, ఆమెను మిస్సవుతున్నానని కన్నీళ్లను ఆపుకుంటూ నివాళి అర్పించారు కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో. భారత ప్రధాని మోదీ కూడా క్వీన్తో రెండు సార్లు జరిగిన చిరస్మరణీయ మీటింగ్స్ను గుర్తు చేసుకున్నారు. ఆమె మంచితనాన్ని ఎన్నటికీ మరువలేనన్నారు. క్వీన్ పెళ్లికి గాంధీ ఇచ్చిన చేతి రుమాలను ఆమె తనకు చూపించినట్లు ప్రధాని మోదీ గుర్తు చేశారు.