Kim Jong Un : అమెరికా, దక్షిణ కొరియా దేశాలు కవ్విస్తే వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సైన్యానికి పిలుపునిచ్చారు. ఇక నుంచి దక్షిణ కొరియాతో ఎలాంటి సయోధ్య, పునరేకీకరణ ప్రయత్నాలు ఉండవని తెగేసి చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు శత్రు దేశాల మాదిరిగా మారాయని అన్నారు. ముఖ్యంగా అమెరికా వైపు నుంచి వచ్చే ముప్పును కాచుకొని ఉండాలని కిమ్ సూచించారు.
‘వాస్తవాన్ని గుర్తించి దక్షిణ కొరియాతో మా సంబంధాలపై స్పష్టతనివ్వాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ వాషింగ్టన్, సియోల్ సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే మా వద్ద ఉన్న అణ్వాయుధాలను కూడా వాడటానికి వెనుకాడబోం. మా దేశాన్ని ప్రధాన శత్రువుగా ప్రకటించి, మా ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం కోసం చూస్తున్న వారితో ఎలాంటి సంబంధాలు కొనసాగించం’ అని కిమ్ స్పష్టం చేశారు.
నిజానికి 1953లో సైనిక ఘర్షణ నిలిచిన నాటి నుంచి ఇరు దేశాలు విడిపోయాయి. దాంతో రెండు దేశాలు ఎప్పటికైనా విలీనం కావాలని లక్ష్యంగా పెట్టుకొన్నాయి. కానీ ఇంతవరకు ఎలాంటి యుద్ధ విరమణ ప్రకటన వెలువడలేదు. దాంతో సాంకేతికంగా మాత్రం రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నట్లే లెక్క. కిమ్ అధికారం చేపట్టాక ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. తాజాగా కిమ్ ప్రకటనతో పునరేకీకరణ అసాధ్యమని తేలిపోయింది.