టొరంటో: కెనడాలో సిక్కు వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. ఆ దేశ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో టొరంటోకు సమీపంలోని మిసిసాగా సిటీలో ఈ నెల 12న జరిగిన దీపావళి వేడుకలపై ఖలిస్థానీ తీవ్రవాదులు దాడి చేశారు.
ఖలిస్థానీ జెండాలతో వచ్చిన రాడికల్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విధ్వంసం సృష్టించారు. ఆనందోత్సాహాలతో పండుగ చేసుకుంటున్న భారతీయులపై రాళ్లు, చెత్త విసిరారు. పోలీసులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు. మిసిసాగా సిటీ కౌన్సిలర్ కరోల్ పర్రిష్ మాట్లాడుతూ, పోలీసుల స్పందన దారుణంగా ఉందని, దీన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు.