ఇస్లామాబాద్: ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ (కేసీఎఫ్) చీఫ్ (Khalistan Commando chief) పరమ్జిత్ సింగ్ పంజ్వార్ అలియాస్ మాలిక్ సర్దార్ సింగ్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో అతడు మరణించగా గన్మెన్లు గాయపడ్డారు. పాకిస్థాన్లోని లాహోర్లో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో జోహార్ టౌన్ సన్ఫ్లవర్ సొసైటీలోని ఇంటి సమీపంలో పరమజిత్ సింగ్ పంజ్వార్పై ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ కాల్పుల్లో ఆయన మరణించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
కాగా, 59 ఏళ్ల పరమ్జిత్ సింగ్, పంజాబ్ తరణ్ తరణ్ సమీపంలోని పంజ్వార్ గ్రామంలో జన్మించాడు. సిక్కుల తిరుగుబాటులో పాల్గొన్నాడు. పలు హత్యా నేరాలకు పాల్పడ్డాడు. సోహల్లోని సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్లో కొంత కాలం పని చేసిన అతడు, బంధువైన లభ్ సింగ్ ప్రోత్సాహంతో 1986లో ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ (కేసీఎఫ్)లో చేరాడు.
మరోవైపు కేసీఎఫ్కు నేతృత్వం వహించిన లభ్ సింగ్ను 1990లో భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దీంతో కేసీఎఫ్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన పరమ్జిత్ సింగ్, సరిహద్దులు దాటి పాకిస్థాన్కు వెళ్లాడు. మోస్ట్ వాంటెట్ ఉగ్రవాదిగా ఉన్న ఆయన ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ (కేసీఎఫ్)ను బతికించేందుకు సరిహద్దుల్లో స్మగ్లింగ్, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా ద్వారా నిధులు సమకూర్చుతున్నాడు. భార్యా పిల్లలు జర్మనీలో స్థిరపడగా, పరమ్జిత్ సింగ్ మాత్రం పాకిస్థాన్లోని లాహోర్లోనే ఉన్నాడు. అయితే అతడు అక్కడ లేడని పాక్ ప్రభుత్వం వాదించింది.