Kenya | ‘ ఆకలితో అలమటించి మరణిస్తే వాళ్లకు జీసెస్ సాత్కారమిస్తాడు.. అప్పుడే మీ జన్మ ధన్యమవుతుంది’ అని ఓ పాస్టర్ చెప్పిన మాటలు 201 మంది ప్రాణాలను బలితీసుకున్నాయి. మరో 600 మందికిపైగా ప్రజల ప్రాణాలను పెను ప్రమాదంలో పడేశాయి. పాస్టర్ చెప్పిన వాక్కులు విని 800 మందికి పైగా ప్రజలు చచ్చేంత వరకు ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఆహారం తీసుకోకుండా దీక్ష చేసి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అలా మరణించిన వారిని స్థానిక అడవిలో పాతిపెట్టడంతో ఈ విషయం ఒక్కసారిగా బయటకొచ్చింది. కెన్యాలో జరిగిన ఈ నిర్వాకం ఇప్పుడు సంచలనంగా మారింది.
కెన్యా పోలీసుల కథనం ప్రకారం.. దక్షిణ కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతమైన కిలిఫీలో 800 ఎకరాల్లో ఉన్న ప్రాపర్టీలో పాల్ మెకంజీ అనే పాస్టర్ 2019 నుంచి ఉంటున్నాడు. అక్కడే ఇంటర్నేషనల్ చర్చి ఆప్ ది గుడ్ న్యూస్ అనే చర్చిని నడుపుతున్నాడు. ఆ చర్చికి వచ్చే భక్తులు పాస్టర్ పాల్ మెకంజీ చెప్పే మాటలను వేద వాక్కులుగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆహారం తీసుకోకుండా తీవ్రమైన ఆకలితో అలమటించి మరణిస్తే జీసెస్ను కలిసే అదృష్టం వస్తుందని చర్చికి వచ్చే భక్తులకు పాల్ మెకంజీ ఉద్బోధ చేశాడు. పాస్టర్ చెప్పిన మాటలకు ప్రభావితమైన వందలాది మంది ఉపవాస దీక్షలు చేయడం మొదలుపెట్టారు.
రోజుల తరబడి అలాగే ఆహారం తీసుకోకుండా ఉండటంతో తీవ్రంగా ఆరోగ్యం క్షీణించి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలా మరణించిన వారిని అక్కడే అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. దీంతో ఈ వార్త ఒక్కసారిగా దావనంలా వ్యాపించడంతో కెన్యా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే గత నెలలో పాస్టర్ పాల్ మెకంజీని పోలీసులు అరెస్టు చేశారు. మెకంజీ భార్యతో పాటు మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టిన మృతదేహాల వెలికితీత మొదలుపెట్టారు. ఈ క్రమంలో 100కిపైగా మృతదేహాలను అధికారులు వెలికితీశారు. శనివారం కూడా 22 మృతదేహాలు బయటపడ్డాయి. ఈ మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించగా.. వీరిలో చాలామంది ఆహారం తీసుకోకపోవడంతో మరణించినట్లు తెలిసింది. మరికొంతమంది గొంతు నులమడం, ఆయుధాలతో దాడి చేయడం వల్ల మరణించినట్లు గుర్తించారు.
పాల్ మెకంజీని అరెస్టు చేయడంతో తమ దీక్షను భగ్నం చేస్తారేమోనని భయపడ్డ వందలాది మంది భక్తులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు 610 మంది మిస్సయ్యారని కోస్ట్ రీజియన్ కమిషనర్ రోడ వెల్లడించారు. దీంతో వాళ్లంతా రహస్య ప్రాంతంలోకి వెళ్లి తమ ఉపవాస దీక్షను కొనసాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. మిస్సయిన వారిని రక్షించేందుకు అధికారులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో స్పందించారు. దీనిపై విచారణ జరిపించి నివేదిక అందించాలని స్పెషల్ ఎంక్వైరీ కమిషన్ను ఏర్పాటు చేశారు. అలాగే దేశంలో మరెక్కడైనా ఇటువంటివి ఆచరిస్తున్నారేమో గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు.