ఇస్లామాబాద్ : బలూచిస్తాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు మరణించారు. లాస్బెలాలో ఆదివారం ఉదయం బస్ లోయలో పడి మంటలు చెలరేగడంతో 39 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. 48 మంది ప్రయాణీకులతో క్వెట్టా నుంచి కరాచీ వెళుతుండగా ఈ వాహనం ప్రమాదానికి గురైందని లాస్బెలా అసిస్టెంట్ కమిషనర్ హంజ అంజుమ్ వెల్లడించారు.
లాస్బెలా వద్ద యూటర్న్ తీసుకునే క్రమంలో బస్ వంతెన పిల్లర్ను ఢీ కొట్టడంతో లోయలో పడి మంటలు చెలరేగాయని, అతివేగమే ప్రమాదానికి కారణమని ఆయన తెలిపారు. మృతులను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని, క్షతగాత్రులను లాస్బెలా ఆస్పత్రికి తరలించామని హంజ అజుమ్ పేర్కొన్నారు.
ఈ ఘటనలో మరికొంత మంది మరణించి ఉంటారని భావిస్తున్నామన్నారు. 17 మృతదేహాలను ఘటనా ప్రాంతం నుంచి వెలికితీశామని అధికారులు తెలిపారు. అతివేగంతో బస్పై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, దీంతో వాహనం బ్రిడ్జ్ పిల్లర్ను ఢీకొని లోయలో పడిందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు.