సింగపూర్: ఆఫ్ఘనిస్థాన్లో సంక్షోభం నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. ఆసియా ఖండంలో పర్యటిస్తున్నారు. ఆమె తన పర్యటనలో భాగంగా ఆదివారం సింగపూర్కు చేరుకున్నారు. సోమవారం సింగపూర్ ప్రభుత్వాధినేతలతో చర్చిస్తారు.
తాజా పరిణామాల మధ్య ఆసియా ఖండ దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ఆమె భరోసా కల్పించనున్నారు. అమెరికా విశ్వసనీయతపై ఆసియా దేశాల ఆందోళనలను నివ్రుత్తి చేస్తారు. సింగపూర్లో పర్యటన ముగించుకుని ఆమె వియత్నాంలోనూ పర్యటిస్తారు.
ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభానికి ముందే ఆమె పర్యటన ఖరారైందని అమెరికా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తాజా పరిస్థితుల్లో ఆసియాలో అమెరికా విస్త్రుత వ్యూహాత్మక లక్ష్యాలపై కమలా హ్యారిస్ ద్రుష్టి సారిస్తారని అన్నారు.
వియత్నాంలో ఆమె పర్యటనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ పౌరులను, ఇతర దేశాల పౌరులను తరలించడానికి అమెరికా ఆపసోపాలు పడుతున్నది.
ఇటువంటి గడ్డు పరిస్థితులనే 1975లో వియత్నాంలో అమెరికా చవి చూసింది. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వ సేనలు దూసుకు రావడంతో సాయిగోన్లోని రాయబార కార్యాలయ భవనంపై నుంచే హెలికాప్టర్ల మీదుగా అమెరికన్లు బయలుదేరి వెళ్లిన ఘటనను గుర్తు చేస్తున్నారు.