Canada | ఒట్టావా: భారత్తో కెనడా కయ్యం ముదురుతున్నది. సిక్కు అతివాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మొదలైన గొడవకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరింత ఆజ్యం పోశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘కెనడా ప్రజలను లక్ష్యంగా చేసుకొని, వారి ఇల్లే వారికి అసురక్షితమైనదనే భావన కల్పించేలా హింసాత్మక చర్యలకు, హత్యకు సైతం దౌత్యవేత్తలను, వ్యవస్థీకృత నేరాలను భారత్ ఉపయోగించుకుంటున్నది.
తద్వారా భారత్ తీవ్ర తప్పిదానికి పాల్పడిందని నమ్ముతున్నా. ఇది ఆమోదయోగ్యం కాదు. గత వేసవి నుంచి ఫైవ్ ఐస్ కూటమి భాగస్వాములతో(అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా), ప్రత్యేకంగా అమెరికాతో కలిసి పని చేస్తున్నాం. అక్కడా చట్టవ్యతిరేక హత్యాప్రయత్నానికి పాల్పడి భారత్ ఇదే విధంగా వ్యవహరించింది.’ అని ట్రూడో ఆరోపించారు.
‘కెనడా ప్రజల రక్షణ కోసం, ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినకుండా గత వారం భద్రతా సంస్థలు, దౌత్యవేత్తలతో భారత ప్రభుత్వాన్ని సంప్రదించాం. కానీ, దురదృష్టవశాత్తు మాతో కలిసి పని చేయాలని భారత్ అనుకోలేదు. తిరస్కరించడంతో పాటు మా ప్రభుత్వంపై వ్యక్తిగత ఆరోపణలకు దిగింది. ఎన్నిసార్లు కోరినా మాకు సహకరించొద్దని భారత్ నిర్ణయించింది.’ అని ట్రూడో పేర్కొన్నారు.
భారత్పై ఆంక్షలు!
బిష్ణోయ్ గ్యాంగ్తో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధాలు ఉన్నాయని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(ఆర్సీఎంపీ) ఆరోపించింది. బిష్ణోయ్ గ్యాంగ్ను ఉపయోగించుకొని దక్షిణాసియాకు చెందిన వారిని, ప్రత్యేకించి కెనడాలోని ఖలిస్థానీ అనుకూల వ్యక్తులను భారత్ లక్ష్యంగా చేసుకున్నదని ఆర్సీఎంపీ కమిషనర్ మైక్ దుహెన్ ఆరోపించారు.
అయితే, నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి తాము ఈ ఆరోపణ చేయడం లేదని, కెనడాలో జరుగుతున్న నేరాల గురించి ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. మరోవైపు, భారత్పై ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నట్టు కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలనీ జోలీ పరోక్షంగా చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్సీఎంపీ సేకరించిన ఆధారాల మేరకు భారత దౌత్యవేత్తలను బహిష్కరించామని, విచారణ కోసం సహకరించేలా భారత్ను కోరుతున్నట్టు చెప్పారు.
ట్రూడో ఆరోపణలను ఖండించిన భారత్
కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ‘ట్రూడో పాత కారణాలతో, అవే పాత విషయాలు చెప్పారు. నిజ్జర్ కేసుకు సంబంధించి భారత్కు విశ్వసనీయ ఆధారాలు ఇచ్చామని కెనడా చెబుతున్నది నిజం కాదు. మొదటి నుంచి కెనడా కేవలం అస్పష్ట ఆరోపణలు చేస్తున్నది’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొన్నది.