న్యూయార్క్, జూలై 2: న్యాయవ్యవస్థ చాలా గొప్పదని, ఇది రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ ‘భారత్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం తీసుకునే చర్యలు న్యాయపరమైన ఆమోదానికి అర్హమైనవేనని నమ్ముతుంటాయి. అలాగే ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను న్యాయవ్యవస్థ సమర్థించాలని ఆశిస్తుంటాయి. కానీ న్యాయవ్యవస్థ కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా ప్రతి వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన విధులు, బాధ్యతలను ఇప్పటికీ ప్రజలు అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజ్యాంగం, వివిధ వ్యవస్థలకు అది అప్పగించిన బాధ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని జస్టిస్ రమణ సూచించారు.