లక్నో : ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్ఘడ్ జిల్లాకు చెందిన ఓ టీవీ జర్నలిస్టు అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. ఏబీపీ న్యూస్, ఏబీపీ గంగా ఛానల్కు పనిచేస్తున్న సులభ్ శ్రీవాత్సవ్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. కానీ ఇటీవల జిల్లాలో సాగుతున్న మద్యం మాఫియా గురించి ఆ జర్నలిస్టు కొన్ని కథనాలు రాశారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆ జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తనను, తన కుటుంబాన్ని అంతం చేయడానికి లిక్కర్ మాఫియా ప్రయత్నిస్తున్నట్లు ఆ జర్నలిస్టు ఆరోపించాడు. కానీ ఆదివారం రాత్రి అనుమానాస్పద రీతిలో శ్రీవాత్సవ్ మృతిచెందాడు. అయితే ఆ జర్నలిస్టు మోటార్సైకిల్ ప్రమాదం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఓ మీడియా ఈవెంట్ కవర్ చేసి రాత్రి 11 గంటలకు తిరిగి వస్తున్న సమయంలో ఓ ఇటుకల తయారీ కేంద్రం వద్ద బైక్ నుంచి అతను కింద జారి కిద్ద పడ్డాడని, అక్కడ ఉన్న కార్మికులు అతన్ని లేపారని, అతని వద్ద ఉన్న ఫోన్తో మిత్రులకు ఫోన్ చేశారని, అయితే హాస్పిటల్కు తీసుకువెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్లు అతను మరణించినట్లు పేర్కొన్నారని ప్రతాప్ఘడ్ పోలీసులు చెప్పారు. యూపీలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వద్రా ఆరోపించారు. ఈ ఘటన పట్ల ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.