Joe Biden | వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ దేశంలోని మధ్య తరగతి వర్గాలను ఆకట్టుకునే దిశగా నిర్ణయం తీసుకోనున్నారు. అమెరికాలోని 44 రాష్ట్రాల్లో కొత్త కొలువులకు కాలేజీ డిగ్రీ తప్పనిసరి కాదని ప్రకటించబోతున్నారు. ఇదే జరిగితే అమెరికన్ల కంటే భారతీయులకు ఎక్కువ లబ్ధి చేకూరనున్నది. విద్యాభ్యాసంలో అమెరికన్ విద్యార్థుల వెనుకబాటు దీనికి కారణం అని ఓ సర్వేలో తేలింది.
2022-23లో న్యూ స్టాన్ఫర్డ్ నిర్వహించిన సర్వే ప్రకారం అమెరికాలో 12వ తరగతి వరకు అడ్మిషన్లు 12 లక్షల్లోపే. కాలేజీ డిగ్రీ పూర్తి చేసిన అమెరికన్లు కేవలం నాలుగో వంతు మంది మాత్రమే ఉంటారు. ప్రతియేటా అమెరికాలో నాలుగేండ్ల డిగ్రీ కోర్సులు పూర్తి చేస్తున్న వారు సుమారు 2.5 లక్షల మంది భారతీయులు ఉన్నారు. విద్యాభ్యాసం పూర్తి కాగానే ఇండియన్ విద్యార్థులు ఉద్యోగాల్లో చేరిపోతున్నారు.
వృత్తిపరమైన నిపుణులకు నంబర్ వన్గా నిలుస్తున్నది భారత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో నిపుణులు అవసరం అని బోయింగ్ అధికార ప్రతినిధి జెస్సికా కెవెల్ తెలిపారు. 200 మంది టెక్నికల్ వర్కర్లు ఈ ఏడాది రిటైర్ అవుతుండగా, ప్రస్తుతం 500 మంది ఉన్నత స్థాయి నైపుణ్యం గల ఇంజినీర్లు బోయింగ్లో పని చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం ముప్పు పేరుతో టెక్ సంస్థలు ఉద్యోగుల ఉద్వాసనకు దిగితే.. అలా ఉద్వాసనకు గురైన వారిలో భారతీయులు మాత్రమే అమెరికాలో ఉద్యోగం పొందగలుగుతున్నారు. ఇండియన్ స్కిల్డ్ నిపుణులు రోజురోజుకు పెరిగిపోతున్నారని బోయింగ్ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే, డెల్లాయిట్ అధ్యయనం అమెరికా మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో 2030 నాటికి 21 లక్షల ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయని తెలుస్తున్నది. దీంతో తయారీ రంగం పట్ల అమెరికన్లు విసుగెత్తిపోతున్నారు. అమెరికా విమానాలయ తయారీ సంస్థ బోయింగ్ వద్ద 220 విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిర్ ఇండియా ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ డీల్ ఆధారంగా మధ్యతరగతి అమెరికన్లకు ఉపాధి కల్పిస్తామన్న హామీతో ఓట్లు పొందేందుకు జో బైడెన్ వ్యూహ రచన చేస్తున్నారు.
అమెరికా నేషనల్ ఎడ్యుకేషన్ ఎవల్యూషన్ కమిషన్ గణాంకాల ప్రకారం రెండేండ్లుగా అమెరికన్ పిల్లలు విద్యాభ్యాసానికి రాకపోవడంతో వచ్చే పదేండ్లలో అమెరికా ఎకానమీ రూ.75 లక్షల కోట్లు నష్టపోతుందని అంచనా. 2021-22లో 16 లక్షల మంది అమెరికన్లు పాఠశాలలకు డుమ్మా కొడుతున్నారు. న్యూయార్క్ సిటీ పబ్లిక్ స్కూళ్లకు 41 శాతం మంది గైర్హాజరవుతున్నారు. కరోనా తర్వాత 40 శాతం అమెరికన్ పేరెంట్స్ హైబ్రీడ్ బేస్డ్ ఎడ్యుకేషన్కే అనుకూలంగా ఉన్నారని ఎడ్చాయిస్ అనే సంస్థ సర్వేలో తేలింది.