బీజింగ్, నవంబర్ 9: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా జాతీయ భద్రత అస్థిర, అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో పోరాడేందుకు, యుద్ధాల్లో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉండాలని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ని ఆదేశించారు.
సామర్థ్యాన్ని పెంపొందించుకొనేందుకు, పోరాట సంసిద్ధతను కొనసాగించేందుకు తన శక్తులన్నింటినీ ఉపయోగించాలని సూచించారు. జిన్పింగ్ ఇటీవల అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ప్రధాన కార్యదర్శితో పాటు సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) అధిపతిగా తిరిగి నియమితులైన విషయం తెలిసిందే. జిన్పింగ్ మంగళవారం సీఎంసీ జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ను పరిశీలించారు.