టోక్యో: జపాన్ కొత్త ప్రధానిగా పుమియో కిషిడా బాధ్యతలు స్వీకరించారు. గత ప్రధాని సుగా ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 64 ఏళ్ల కిషిడా అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేతగా గత వారం ఎన్నికయ్యారు. అయితే ఇవాళ ఆ దేశ ఉభయసభలు ఆయన్ను ప్రధానిగా ఎన్నుకున్నాయి. పుమియో కిషిడా జపాన్ నూరవ ప్రధానిగా రికార్డు క్రియేట్ చేశారు. రాబోయే జనరల్ ఎలక్షన్స్లో ఆయన లిబరల్ పార్టీని ముందు ఉండి నడిపించాల్సి ఉంది. త్వరలోనే కిషిడా తన క్యాబినెట్ను ప్రకటించనున్నారు. దిగువ సభను ఆయన అక్టోబర్ 14వ తేదీన రద్దు చేయనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 31వ తేదీన జనరల్ ఎలక్షన్స్ నిర్వహించనున్నారు.
20 మందితో కిషిడా తన క్యాబినెట్ను ప్రకటించనున్నారు. దాంట్లో 44 ఏళ్ల నుంచి 77 ఏళ్ల వరకు మంత్రులు ఉండనున్నారు. ఆ 20 మందిలో కేవలం ముగ్గురు మాత్రమే మహిళలు ఉంటారు. టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ, కరోనా మహమ్మారి వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నట్లు మాజీ ప్రధాని సుగా చెప్పిన విషయం తెలిసిందే.