టోక్యో, ఏప్రిల్ 1: జనాభాను పెంచడానికి జపాన్ ప్రభుత్వం నానాతంటాలు పడుతున్నది. పెద్ద ఎత్తున సబ్సిడీలు, నగదు ప్రయోజనాలు అందిస్తామని, వేతనాల పెంపుదల అమలుజేస్తామని, వివాహం చేసుకొని, పిల్లల్ని కనాలంటూ కార్మికరంగంలోని యువతను కోరుతున్నది. ఇందుకు సంబంధించి తాజాగా ప్రతిపాదనలను ఆ దేశ ప్రభుత్వం సిద్ధం చేసింది. జనాభా రేటు పడిపోవటంపై ఆ దేశ ప్రధాని ఫ్యుమియో కిషిదా ఆందోళన వ్యక్తం చేస్తూ పార్లమెంట్లో ఇటీవల ప్రసంగించారు.
దేశంలో ఈ తరహా పరిస్థితి ఇంతకుముందెన్నుడూ లేదని తెలిపారు. జనన రేటు పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసిందని వెల్లడించారు. పిల్లల పెంపకానికి, వారి విద్యలో ఇప్పుడున్న సబ్సిడీలను మరింత పెంచాలని, వివాహం చేసుకొని పిల్లలను కనే యువతకు వేతనాలు పెంచాలని ప్రభుత్వం తాజా ప్రతిపాదనల్లో పేర్కొన్నది. జపాన్ ప్రస్తుత జనాభా 12.5 కోట్లు. గత 15 ఏండ్లుగా దేశవ్యాప్తంగా జననాల రేటు పడిపోతున్నది. ఇదిలాగే కొనసాగితే 2060 నాటికి దేశ జనాభా 9 కోట్లకు పడిపోతుందని గణాంకాలు చెప్తున్నాయి.