వాషింగ్టన్, డిసెంబర్ 23: అమెరికా కాంగ్రెస్ భవనంపై దాడికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుట్ర పన్నినట్టు ‘జనవరి 6’ కాంగ్రెస్ కమిటీ నిర్ధారించింది. 2020 అధ్యక్ష ఎన్నికల చట్టబద్ధమైన ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ నేరపూరితంగా ‘బహుముఖ కుట్ర’కు పాల్పడ్డారని తేల్చింది. కాంగ్రెస్పై దాడి చేయకుండా తన మద్దతుదారులను నిరోధించలేకపోయారని పేర్కొన్నది. మాజీ అధ్యక్షుని అనుచిత ప్రవర్తన, కాంగ్రెస్పై సాయుధ తిరుగుబాటుదారుల దాడిపై 18 మాసాల దర్యాప్తు అనంతరం కమిటీ 814 పేజీల నివేదికను గురువారం విడుదల చేసింది.
జనవరి 6న జరిగిన ఘటనలపై ఏర్పాటైనది కావడం వల్ల కమిటీని ఆ పేరుతోనే వ్యవహరిస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా కమిటీ వెయ్యిమందికి పైగా సాక్షులను విచారించి, పదిసార్లు బహిరంగ విచారణలు నిర్వహించి, లక్షలాది పత్రాలను పరిశీలించింది. ప్రభుత్వ పదవి చేపట్టకుండా ట్రంప్పై నిషేధం విధించాలని కమిటీ సిఫారసు చేసింది.