రోమ్: కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో ఇటలీ ప్రభుత్వం అప్రమత్తమయింది. దేశంలో 50 ఏండ్లు నిండినవారికి వ్యాక్సిన్ తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఇటలీ క్యాబినెట్ నిర్ణయించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని, జూన్ 15 వరకు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 50, అంతకు పైబడిన వయస్సు కలిగినవారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. దీనివల్ల కరోనా బారినపడేవారి సంఖ్య తగ్గడంతోపాటు హాస్పిటళ్లతో చేరివారు తగ్గిపోతారని చెప్పారు. దీంతో ఆరోగ్య వ్యవస్థపై భారం తగ్గుతుందని వెల్లడించారు.
ఐరోపాలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో ఇటలీ రెండోది. బ్రిటన్ మొదటి స్థానంలో ఉన్నది. దేశంలో ఇప్పటివరకు 67,56,035 మంది కరోనా బారిన పడ్డారు. అందులో లక్ష 38 వేల మంది మహమ్మారికి బలయ్యారు. కాగా, ఆస్ట్రియా కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నది. దేశంలోని 14 ఏండ్లు పైబడినవారికి వ్యాక్సిన్ తప్పనిసరి చేసింది. అదేవిధంగా గ్రీస్లో జనవరి 16 నుంచి 60 ఏండ్లు నిండినవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.