Covid Parties | కరోనా వస్తే కనీసం 15 రోజులు ఐసోలేషన్లో ఉండాల్సిందే. ఎవ్వరినీ కలవడానికి వీలు ఉండదు. ఒక్కరే ఒంటరిగా ఉండాలి. డాక్టర్ల కన్సల్టేషన్ కంపల్సరీ. డాక్టర్ల సూచనలతో ట్రీట్మెంట్ తీసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా బారి నుంచి తప్పించుకోగలం. కానీ.. ఒక చోట మాత్రం కరోనా వచ్చిన వాళ్లతో పార్టీలు చేసుకుంటున్నారు. వాళ్లతో కలిసి డిన్నర్ చేస్తున్నారు. వాళ్లతో కలిసి వైన్ తాగుతున్నారు. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే విషయాలు తెలియాలంటే మనం ఓసారి ఇటలీ వెళ్లి రావాల్సిందే.
ఇటలీలో కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వ్యాక్సినేషన్ను ఇటలీ కంపల్సరీ చేసింది. 50 ఏళ్లు దాటిన వాళ్లు అయితే.. ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. కుంటి సాకులు నడవవు. లేదంటే.. భారీగా జరిమానాలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 1, 2022 నుంచి 50 ఏళ్లు దాటిన వాళ్లు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వచ్చిన వాళ్లు మినహా.. మిగితా వాళ్లు అంతా వ్యాక్సిన్ను విధిగా వేసుకోవాల్సిందే. దీంతో వ్యాక్సినేషన్ను వ్యతిరేకిస్తున్న వాళ్లలో గుబులు స్టార్ట్ అయింది.
అందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్లు కోవిడ్ పార్టీలను ప్లాన్ చేస్తున్నారు. కోవిడ్ వచ్చిన పేషెంట్లకు డబ్బులు ఇచ్చి మరీ వాళ్లతో డిన్నర్ చేస్తున్నారు. వాళ్లతో కూర్చొని వైన్ తాగుతున్నారు. తద్వారా తమకు కూడా కరోనా సోకితే వ్యాక్సినేషన్ నుంచి తప్పించుకోవచ్చనేది వాళ్ల ప్లాన్.
అలాగే.. కరోనా నుంచి కోలుకున్నాక.. వెంటనే ప్రతి ఒక్కరూ నేషనల్ హెల్త్ కార్డు కోసం అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కార్డు కేవలం కరోనా సోకిన వాళ్లకే ప్రభుత్వం ఇస్తోంది. ఓవైపు వ్యాక్సిన్ను తప్పించుకొని.. కరోనా వచ్చి కోలుకున్నాక నేషనల్ హెల్త్ కార్డును పొందడం కోసం కొందరు వేస్తున్న ఎత్తుగడలు ఇవి.
అయితే.. ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కోసం.. వ్యాక్సిన్ను తప్పించుకోవడం కోసం కోవిడ్ పార్టీల పేరుతో కరోనా ఎక్కించుకునే వాళ్లపై ప్రభుత్వం నజర్ పెట్టింది. అటువంటి వాళ్లపై కేసులు నమోదు చేస్తామని.. అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది.
ఇటలీలో కోవిడ్ పేరుతో పార్టీలు జరగడం ఇదే తొలిసారి కాదు. గత సంవత్సరం నవంబర్లో కూడా కోవిడ్ పేషెంట్లు బయట తిరిగారు. కోవిడ్ పార్టీలకు అటెంట్ అయ్యాయి. దాని వల్ల చాలామందికి కరోనా సోకింది. ఒక వ్యక్తి చనిపోయాడు.