న్యూయార్క్, సెప్టెంబర్ 27: వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాగే కొనసాగితే ఉద్యోగులంతా సోమరిపోతుల్లా తయారవుతారని పలు కంపెనీల యాజమాన్యాలు భయపడుతున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు. కరోనా తగ్గిపోవటంతో అనేక కంపెనీలు ఆఫీస్కు రావాలని ఉద్యోగులను ఆదేశిస్తున్నాయి. అయితే, ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిపై భారీ ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో సత్య నాదెళ్ల స్పందించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగుల్లో ఉత్పాదకత తగ్గిపోయిందని యాజమాన్యాలు భావిస్తున్నాయని, ఉద్యోగులు మాత్రం మరింత ఎక్కువగా పనిచేస్తున్నామని చెప్తున్నారని తెలిపారు. ఇందుకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులపై చేసిన సర్వే వివరాలను ఆయన వెల్లడించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎక్కువగా పనిచేస్తున్నామని 87 శాతం మంది ఉద్యోగులు చెప్పారని పేర్కొన్నారు. అయితే, కింది స్థాయి ఉద్యోగుల్లో పనితనం తగ్గిందని 80 శాతం మంది మేనేజర్ స్థాయి ఉద్యోగులు అభిప్రాయపడ్డారని వివరించారు. దీనివల్లే ఉద్యోగులను ఆఫీస్కు వచ్చేలా కంపెనీలు ఆదేశిస్తున్నాయని తెలిపారు. కరోనా కంటే ముందు మైక్రోసాఫ్ట్లో 2 శాతం ఖాళీలే ఉండేవని, ప్రస్తుతం 20 శాతం ఉన్నాయని చెప్పారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటే ఖాళీల భర్తీ తొందరగా జరుగుతుందని పేర్కొన్నారు.