రమల్లా, నవంబర్ 1: గాజాలోని 22 లక్షల మంది పాలస్తీనియన్లను బలవంతంగా, శాశ్వతంగా ఈజిప్ట్లోని సినాయ్ పెనిన్సులాకు వెళ్లగొట్టేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నది. మొత్తం పాలస్తీనా జనాభాను గాజా నుంచి ఖాళీ చేయించాలని ఇజ్రాయెల్ నిఘా మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలెట్టినట్టు కీలక పత్రాలు బయటకు వచ్చాయి. 10 పేజీలున్న ఈ పత్రాలు మీడియాకు లీక్ అయ్యాయి. పాలస్తీనియన్ల తరలింపును ప్రతిపాదిస్తూ రూపొందించిన పాలసీని ఆర్మీ, ఇజ్రాయెల్ మంత్రిత్వశాఖలతో నిఘా శాఖ పంచుకున్నట్టు పత్రాల్లో పేర్కొన్నారు. గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడిలో 50మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరిలో అల్జజీరా జర్నలిస్టు కుటుంబానికి చెందిన 19మంది ఉన్నట్టు సమాచారం.