Netanyahu | ఇరాన్(Iran) తన కుమారులలో ఒకరిని చంపడానికి ప్రయత్నించిందని ఇజ్రాయెల్(Israeli,) ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Netanyahu) తీవ్రమైన ఆరోపణలు చేశారు. నెతన్యాహు ఇజ్రాయెల్కు చెందిన ‘ఛానెల్ 14’తో మాట్లాడిన ఫోన్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇద్దరు కుమారులలో ఒకరిని హతమార్చేందుకు ఇరాన్ తీవ్రంగా ప్రయత్నించిందని ఆయన తెలిపారు. “ఒక నమ్మశక్యం కాని ఘటన జరిగింది. ఇరాన్ నా కుమారులలో ఒకరిని లక్ష్యంగా చేసుకుంది. నా కుమారుడి ప్రాణాలు తీసేందుకు ఇరాన్ ప్రయత్నించింది” అని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే, ఈ కుట్ర ఎప్పుడు జరిగింది, ఎక్కడ, ఎలా జరిగింది అనేది స్పష్టం చేయలేదు. అలాగే తన ఇద్దరు కుమారులైన యాఇర్, అవ్నెర్లలో ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారనే విషయాలను సైతం నెతన్యాహు వెల్లడించలేదు.
ఫిబ్రవరిలో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో నెతన్యాహు చేసిన ఈ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నెతన్యాహు ఎన్నికల్లో ఓడిపోయినా, ఆయన భార్య, కుమారులకు కనీసం ఐదేళ్ల పాటు భద్రత కల్పించేలా ‘షిన్ బెట్’తో ఒప్పందం కుదుర్చుకున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని ఉద్దేశించే నెతన్యాహు తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు. తమ కుటుంబానికి కల్పిస్తున్న భద్రత ఏమాత్రం విలాసవంతమైనది కాదని ఆయన వెల్లడించారు. సరైన భద్రత లేకపోతే తమ ప్రత్యర్థులు తన కుమారుడిని చంపి, అనుకున్నది సాధించేవారని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాతో కలిసి ఫిబ్రవరి 28న ఇరాన్పై యుద్ధాన్ని ప్రారంభించిన నెతన్యాహు, ఈ భద్రతా ముప్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో నెతన్యాహుకు పోటీగా బరిలోకి దిగుతున్న గాడీ ఐసెన్కోట్కు భద్రత కల్పించేందుకు దేశీయ సెక్యూరిటీ ఏజెన్సీ ‘షిన్ బెట్’ నిరాకరించిందనే కథనాలపై చర్చ జరుగుతున్న సమయంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రత్యర్థి ఐసెన్కోట్కు భద్రత ఇవ్వకపోవడంపై నెతన్యాహు స్పందిస్తూ.. ప్రధాన మంత్రి పదవికి పోటీ పడే ఏ అభ్యర్థికైనా సరైన భద్రత కల్పించాలని తానే స్వయంగా ‘షిన్ బెట్’ అధిపతితో మాట్లాడినట్లు చెప్పారు. కాగా, ఈ ఆరోపణపై స్పందించాలని అభ్యర్థనకు న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి వద్ద ఉన్న ఇరాన్ ప్రతినిధి బృందం కోరగా ఇరాన్ స్పందించలేదు.