జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి (Israel-Hamas War) ఇప్పట్లో ముగింపు పడేలా లేదు. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై (Gaza) భూతల దాడులను తీవ్రతరం చేసింది. గత 24 గంటల్లో 600 స్థావరాలపై విరుచుకుపడింది. ప్రతిగా ఇజ్రాయెల్లోని (Israel) నగరాలపై హమాస్ (Hamas) రాకెట్ దాడులకు పాల్పడుతున్నది. ఇరుపక్షాల దాడులు ప్రతిదాడులతో భారీసంఖ్యలో పౌరులు మరణిస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం ముట్టడించడంతో గాజాలోని ప్రజలు కనీసం తాగడానికి నీరు కూడా దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని (Ceasefire) ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. అయితే కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, హామాస్ విజయం సాధించేవరకు యుద్ధ ఆగదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) స్పష్టం చేశారు.
అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన గాజాలో కొనసాగుతున్న దాడుల్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. దాడుల్ని ఆపితే హమాస్కు లొంగిపోయినట్లు (Surrender) అవుతుందని చెప్పారు. అలా ఎప్పటికీ జరగదని తెలిపారు. హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించడంలో ప్రపంచ దేశాలు తమకు సాహాయం చేయాలని కోరారు.
అక్టోబర్ 7 నాటి హామాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ సైన్యాలు గాజాపై భూతల, గగణ తల దాడులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో ఇప్పటిరకు గాజాలో 8300 మంది మరణించారని హమాస్ ప్రకటించింది. కాగా, హమాస్ దాడుల్లో 1400 మంది ఇజ్రాయెలీ పౌరులు మరణించారని, 230కిపైగా మందిని బందీలుగా తీసుకెళ్లారని నెతన్యాహూ వెల్లడించారు. మొదటి నుంచి ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తున్న అమెరికా కూడా కాల్పుల విరమణ ప్రతిపాదనను వ్యతిరేకించడం గమనార్హం.