జెరుసలెం: పెగాసస్ స్పైవేర్.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ హ్యాకింగ్ వ్యవహారానికి కారణమైన ఈ స్పైవేర్ సృష్టికర్త ఇజ్రాయెల్లోని ఎన్ఎస్వో గ్రూప్. ఇప్పుడీ గ్రూప్ ఆఫీస్లపై ఇజ్రాయెల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆ గ్రూప్ గురువారం ధృవీకరించింది. అయితే తాము మాత్రం పూర్తి పారదర్శకతతో పని చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్ రక్షణ శాఖకు చెందిన ప్రతినిధులు మా కార్యాలయాలకు వచ్చారు. వాళ్ల తనిఖీలను మేము స్వాగతిస్తున్నాం. ఇజ్రాయెల్ అధికారులతో మా కంపెనీ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోంది అని ఎన్ఎస్వో గ్రూప్ అధికార ప్రతినిధి వెల్లడించారు. తమ మీద వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఈ తాజా తనిఖీలు బయటపెడతాయన్న నమ్మకం తమకు ఉందని ఆ ప్రతినిధి అన్నారు.
ఈ దాడులకు కారణమేంటి?
పెగాసస్ స్పైవేర్ నిఘా వివాదంపై విచారణ జరపడానికి మంగళవారం ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారుల బృందం ఎన్ఎస్వో గ్రూపు కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ గ్రూపు అభివృద్ధి చేసిన పెగాసస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి పలువురు జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, హక్కుల కార్యకర్తల ఫోన్లను హ్యాక్ చేసినట్లు 17 మీడియా మీడియా సంస్థల విచారణలో తేలింది. దీనిపై విచారణ జరపడానికి ఇజ్రాయెల్ పలు మంత్రిత్వశాఖ అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ అంశాన్ని తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇజ్రాయెల్ చెప్పగా.. ఎన్ఎస్వో గ్రూపు మాత్రం తమపై ఆరోపణలు అవాస్తవాలని చెబుతూ వస్తోంది. తాము ఈ సాఫ్ట్వేర్ను కేవలం ప్రభుత్వాలకే అమ్ముతామని, వాళ్లు ఎలా ఉపయోగిస్తారన్నది వాళ్ల ఇష్టమని కంపెనీ చెప్పింది.