Israel War | రెండునెలలు గడుస్తున్నా హమాస్, ఇజ్రాయెల్ సాగుతున్న పోరు సద్దుమణగడం లేదు. మొన్నటి వరకు కాల్పుల వివరణ కొనసాగగా.. మళ్లీ ఇరుపక్షాల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గాజాలో పరిస్థితి దారుణంగా తయారైంది. దక్షిణ గాజాలోని ప్రధాన నగరంలో ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్నది. ఖైదీలను విడుదల చేయాలనే తమ డిమాండ్ను నెరవేర్చకపోతే.. బందీలను సజీవంగా వదిలిపెట్టమని హమాస్ హెచ్చరించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన విషయం తెలిసిందే. దాడుల్లో ఇప్పటి వరకు 1200 మందికిపైగా ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో హమాస్ యోధులు 240 మందిని బంధీలుగా పట్టుకున్నారు. మరో వైపు ఇజ్రాయెల్ జరుపుతున్న ప్రతీకార దాడుల్లో దాదాపు 18వేల మందికిపైగా పాలస్తీనియన్లు చనిపోయారు.
ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం.. గాజాలోని 2.4 మిలియన్ల మంది నివాసం ఉండగా.. ఇందులో 1.9 మిలియన్ల మంది తమ ఇండ్లను వదిలేశారు. ఇందులో సగం మంది వరకు పిల్లలున్నారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమై 65 రోజులు గడిచినా.. ఎప్పుడు ఈ యుద్ధం ముగిస్తుందో తెలియని పరిస్థితి. ఇదిలా ఉండగా.. దక్షిణ గాజా స్ట్రిప్లో హమాస్ దాడిలో ఇజ్రాయెల్కు చెందిన ముగ్గురు సైనికులు ప్రాణాలకు కోల్పోయారు. దీంతో భూతల దాడుల్లో మరణించిన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 104కి చేరింది. ఖాన్ యూనిస్ ప్రాంతంలో నలుగురు గాయపడగా.. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. దాడులు మొదలైనప్పటి నుంచి 600 మంది ఐడీఎఫ్ సైనికులు గాయపడ్డారు. మరోవైపు, ఖైదీలు, బందీల మార్పిడి లేకుండా.. ఇజ్రాయెల్ బందీలను సజీవంగా తీసుకెళ్లలేదని హమాస్ ఆదివారం హెచ్చరించింది. దాంతో ఐడీఎఫ్ ఆది, సోమవారాల్లో గాజాపై రాకెట్ల వర్షం కురిపించింది. ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆసుపత్రిపై ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు మహిళలు మరణించడంతో పాటు డజన్ల సంఖ్యలో గాయపడ్డారని హమాస్ పేర్కొంది. దాదాపు 137 మంది బందీలు ఇంకా హమాస్ అదుపులోనే ఉన్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నది.
యుద్ధంతో పాటు వాతావరణం సైతం ప్రతికూలంగా మారే ప్రమాదం పొంచి ఉన్నది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. గాజా స్ట్రిప్లో వర్షాకాలం సమీపిస్తున్నది. ఇప్పటికే తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. గాలులకు ఏర్పాటు చేసిన టెంట్లు కొట్టుకుపోయాయి. యుద్ధం కారణంగా దాదాపు 1.8 మిలియన్ పాలస్తీనియన్లు నిర్వాసితులయ్యారు. ఈ పరిస్థితుల్లో తీరప్రాంతాల్లో వాతావరణం కారనంగా నిరాశ్రయులు, సరైన మౌలిక సదుపాయాల లేమితో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. శీతాకాలం రాకతో గాజాలో ఆరోగ్య సేవలు మరింత దిగజారనున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఏర్పాటు చేసిన టెంట్లలో మహిళలు ప్రసవిస్తున్నారు. అదే సమయంలో కట్టెల నుంచి వచ్చే పొగ శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతున్నది. మందులు నిండుకోవడంతో పదిశాతం మెడికల్ స్టోర్లు మాత్రమే పని చేస్తున్నాయి. అవసరమైన మందులు దొరకని దొరక్క ఇబ్బందులుపడుతున్నారు. ఓ వైపు నివసించేందుకు ఇండ్లు లేక జనం ఆరుబయటే నిద్రిస్తున్నారు. పలువురు టెంట్లు వేసుకోగా.. చలితో ఇబ్బందులుపడుతున్నారు.
గాజాలో పరిస్థితులుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. గాజా స్ట్రిప్లో అంటువ్యాధులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని పేర్కొంది. అతిసారం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కామెర్లు, హెపటైటిస్-ఏ, మెనింజైటిస్తో బాధపడుతున్నారు. మరోవైపు మందులు లేకపోవడంతో ఆపరేషన్ అనంతరం ఇన్ఫెక్షన్ సోకి క్షతగాత్రులు మృత్యువాత పడుతున్నారు. చాలా కాలంగా అస్వస్థతకు గురై మందు దొరక్క అల్లాడిపోతున్నారు. స్థానికుడు ఒకరు మాట్లాడుతూ తన తల్లి వారం కింద మరణించిందని.. ఆమె హై బీపీ, మధుమేహంతో బాధపడుతుందని తెలిపారు. యూఎన్ ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరంలో అవసరమైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులుపడుతున్నట్లు తెలిపాడు.