Lebanon : లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క ఇరాన్పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు లెబనాన్పై కూడా దాడులకు దిగింది. ఈ రెండు దేశాల మధ్య కూడా దశాబ్దాలుగా వైరం నడుస్తోంది. వారం రోజుల నుంచి ఇరాన్.. లెబనాన్పై దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 400 మందికిపైగా లెబనాన్ ప్రజలు మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరుట్పై కూడా దాడి చేసింది. ప్రజల నివాసాలపై కూడా మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఇదే సమయంలో ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన ఒక పని వివాదానికి కారణమైంది. లెబనాన్పై దాడుల్లో భాగంగా ప్రజల నివాసాలపై వైట్ ఫాస్ఫరస్ ప్రయోగించినట్లు తేలింది. ఈ నెల 3న లెబనీస్ పట్టణమైన యోమోర్పై జరిపిన దాడిలో ఇండ్లపై వైట్ ఫాస్ఫరస్ చల్లినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం గుర్తించింది. దీనికి సంబంధించిన ఆధారాల్ని కూడా సేకరించింది. దీని ద్వారా రెండు ఇండ్లు, ఒక కారు మంటల్లో చిక్కుకున్నాయి. అక్కడి ఫైర్ అధికారులు స్పందించి మంటలు ఆర్పేశారు. ఈ వైట్ ఫాస్ఫరస్ చల్లిన తర్వాత చిన్న నిప్పురవ్వ అంటుకున్నా మొత్తం మంటలు వ్యాపిస్తాయి. ఇలాంటి చర్యలకు అనుమతి ఉండదు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ ఇలాంటి పని చేస్తుందని, దీనివల్ల తమ పౌరుల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉంటుందని లెబనాన్ అధికారులు అన్నారు.
వీటి ద్వారా ఎవరైనా గాయాలపాలైనా వాటి ప్రభావం చాలాకాలం ఉంటుందని తెలిపారు. వైట్ ఫాస్ఫరస్ను బాంబులు, షెల్స్, రాకెట్లు వంటి వాటిలో వాడుతారు. ఈ కెమికల్ ఆక్సిజన్ రియాక్షన్కు గురైనా మంటలు అంటుకుంటాయి. అందుకే అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ కెమికల్ను వాడటం, పౌరులకు హాని చేయడం నేరం. మిలిటరీ కార్యక్రమాలకే దీన్ని వాడాలి.