జెరూసలెమ్: కరోనా కేసులు తగ్గుముఖంపట్టాయి. ప్రజలు క్రమంగా సాధారణ జీవణం సాగిస్తున్నారు. వ్యాపారాలూ పుంజుకున్నాయ్. దీంతో ఆదాయ మార్గాల్లో ఒకటైన పర్యాటక రంగంపై ప్రభుత్వాలు దృష్టిసారిస్తున్నాయి. ఒక్కొక్కటిగా చారిత్రక, పర్యాటక ప్రాంతాలను ప్రజల సందర్శనార్ధం తెరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి తమ దేశంలోకి పర్యాటకులను అనుమతిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే పర్యాటకులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని స్పష్టం చేసింది.
కాగా, ప్రజలకు బూస్టర్ డోస్ ఇస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్ ముందున్నది. ఇప్పటికే 30.9 లక్షల మందికి బూస్టర్ డోస్ పంపిణీ చేశారు. అయితే ఆగస్టు, సెప్టెంబర్ మొదటి వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ప్రస్తుతం అక్కడ వందల్లోనే పాజిటివ్ కేసులు వస్తున్నాయి.
దీంతో అంతర్జాతీయ సరిహద్దులను తెరవాలని ప్రధాని నఫ్తాలి బెన్నెట్ నిర్ణయించారు. నవంబర్ 1 నుంచి ఏ దేశానికి చెందినవారైన ఇజ్రాయెల్లో పర్యటించవచ్చని చెప్పారు. అయితే తాము వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందని, అదికూడా ఆరు నెలల లోపుదై ఉండాలని స్పష్టం చేశారు. అదేవిధంగా పర్యాటకులు తప్పనిసరిగా కరోనా టెస్టు చేయించుకోవాలన్నారు.