Netanyahu: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కు చేదు అనుభవం ఎదురైంది. యుద్ధం మొదలై 80 రోజులు దాటినా హమాస్ మిలిటెంట్ల చెరలో ఇంకా చాలా మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నారు. ఇదిలావుంటే మరోవైపు యుద్ధాన్ని తక్షణమే నిలిపివేసి శాంతి స్థాపనకు సహకరించాలంటూ ఇజ్రాయెల్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో బెంజామిన్ నెతన్యాహు మంగళవారం ప్రత్యేక పార్లమెంటరీ సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బందీల కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. నెతన్యాహు మాట్లాడుతున్న సమయంలో పార్లమెంట్ గ్యాలరీలో ఉన్న బందీల కుటుంబీకులు ఆందోళనకు దిగారు. బందీల ఫొటోలు, పేర్లు ఉన్న పోస్టర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా బందీలను విడిపించేందుకు మరికొంత సమయం పడుతుందని నెతన్యాహు చెప్పగా.. సమయం లేదంటూ ఆందోళనకారులు కేకలు వేశారు. ఇప్పుడే..! ఇప్పుడే..! అంటూ నినాదాలు చేశారు. ‘మీరు మా వాళ్లను తిరిగి తీసుకువస్తారని నమ్ముతున్నాం, అక్కడ మీ బిడ్డలే ఉంటే ఏం చేసేవారు..? ఇప్పటికే 80 రోజులు గడిచాయి. ఒక్కో నిమిషం నరకంలా అనిపిస్తుంది’ అని ఆవేదన వెళ్లగక్కారు.
దాంతో బందీలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిరంతర చర్యలు చేపడుతూనే ఉందని నెతన్యాహు వెల్లడించారు. తాను ఇప్పటికే బాధిత కుటుంబాలతో సమావేశమై వారి బాధలు విన్నానని చెప్పారు. కాగా, మధ్యమధ్యలో యుద్ధానికి స్వల్ప విరామాలు ఇవ్వడంతో కొంతమంది బందీలు విడుదలైనప్పటికీ.. ఇంకా 129 మంది హమాస్ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్ తెలిపింది.
పార్లమెంట్ స్పెషల్ సెషన్లో ప్రసంగానికి ముందు నెతన్యాహు గాజాలో పర్యటించారు. యుద్ధానికి విరామం ఇస్తారంటూ మీడియాలో వస్తోన్న ఊహాగానాలను ఈ సందర్భంగా ఆయన కొట్టిపారేశారు. తాము యుద్ధాన్ని ముగించడం లేదని స్పష్టం చేశారు. సైనికపరంగా ఒత్తిడి ఉంటేనే బందీల విడుదల సాధ్యమవుతుందని అన్నారు. హమాస్ గ్రూప్ అంతం కాకుండా శాంతి సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.