Israel : పశ్చిమాసియాలో శాంతి స్థాపనలో భాగంగా కీలక అడుగు పడింది. వరుసగా దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విభాగం వెల్లడించింది. ఈ పరిణామం ఇరాన్తో, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న యుద్ధం ముగింపునకు కూడా ఉపయోగపడుతుందని అమెరికా అభిప్రాయపడింది. అయితే, కాల్పుల విరమణ వెనుక ఇరాన్ ఉన్నట్లు తెలుస్తోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తూనే ఉంది.
దీంతో లెబనాన్పై దాడులు ఆపకపోతే అమెరికాతో శాంతి చర్చలు కొనసాగించలేమని ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ జోక్యం చేసుకుని ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా చేసినట్లు సమాచారం. ఇరు దేశాల ప్రతినిధులు కాల్పుల విరమణకు అంగీకరించారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండగా, అమెరికా కూడా ఇరాన్లోని దీవులపై దాడులకు తెగబడింది. బదులుగా ఇరాన్ కూడా యూఏఈ, కువైట్పై దాడులు చేస్తోంది. మరోవైపు హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్, అమెరికా దళాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా లెబనాన్–ఇజ్రాయెల్ మధ్య తాజా ఒప్పందం వల్ల సరిహద్దులో శాంతి భద్రతలు నెలకొంటాయి. అలాగే, ఇరాన్ మద్దతు ఇస్తున్న హెజ్బొల్లా తీవ్రవాదులు కూడా ఇజ్రాయెల్పై దాడులు ఆపాలి.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు లేవు కాబట్టి.. సరిహద్దులో పైలట్ జోన్లు ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షిస్తుంటారు. సరిహద్దులో లెబనీస్ ఆర్మీ మాత్రమే పని చేస్తుంది. దీనివల్ల అక్కడ ఉగ్రకార్యకలాపాల్ని తగ్గిస్తారు. రెండు దేశాల మధ్య మరోసారి జూన్ 22న చర్చలు జరుగుతాయి. భవిష్యత్లో ఇరు దేశాల మధ్య సంబంధాల్ని ఆయా దేశాలు మాత్రమే నిర్ణయించుకుంటాయని తాజా ఒప్పందంలో నిర్ణయించారు. అయితే, లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. భూతలంపై సరిహద్దులో ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.