Israel Attacks Lebanon : లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. దక్షిణ లెబనాన్, నబాతే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం దాడులకు దిగింది. ఈ క్రమంలో సర్ అల్ ఘబ్రియాలోని మూడంతస్తుల బిల్డింగ్పై దాడి చేయడంతో అందులోని 19 మంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్పై కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తోంది.
ఈ దాడుల్లో 12 మంది మరణించారు. మొత్తంగా ఆదివారం ఉదయం వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 47 మంది మరణించినట్లు లెబనాన్ ప్రభుత్వం తెలిపింది. ఘటన జరిగిన ప్రదేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. లెబనాన్పై ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. 40 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఇజ్రాయెల్ పైలట్ రాన్ అరద్ అస్థికల కోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది ఇజ్రాయెల్. ఈ క్రమంలో లెబనాన్ దేశంలోకి దూసుకెళ్లిన ప్రత్యేక దళాలు అక్కడి ఒక గ్రామంలో అతడి అస్థికల కోసం వెతుకులాట ప్రారంభించాయి. అయినప్పటికీ, అతడి సమాధి, ఇతర వివరాలు వంటివేవీ గుర్తించలేదు. 1986లో ఇజ్రాయెల్ ఎయిర్ఫోర్స్ నేవిగేటర్ అయిన రాన్ అరద్ అనే పైలట్ నడుపుతున్న విమానాన్ని అప్పటి యుద్ధంలో లెబనాన్ కూల్చింది. అప్పటినుంచి అతడి ఆచూకీ, వివరాలేవీ తెలియరాలేదు.
అయితే, నమిషిత్ గ్రామంలోని బెక్కా వ్యాలీలోని సమాధి వద్ద అతడి అస్థికలు, సమాధి ఉండొచ్చనే సమాచారంతో అక్కడికి ఇజ్రాయెల్ సైన్యం వెళ్లింది. ఎయిర్ఫోర్స్కు చెందిన ప్రత్యేక కమాండోలు ఆ ప్రాంతంలో హెలికాప్టర్ల నుంచి తాళ్లతో దిగారు. సమాధుల వద్ద వెతికారు. అయితే, రాన్ అరద్కు సంబంధించిన ఆనవాళ్లు దొరకలేదు. అలాగే కొన్ని సమాధులు తవ్వి ఉండటం అనుమానాలకు తావిచ్చింది. అయితే, 4 దశాబ్దాలైనా తమ దేశ సైనికుడి అస్థికల కోసం ఇజ్రాయెల్ వెతుకుతూనే ఉండటం విశేషం. తమ సెర్చ్ ఆపరేషన్ ఇంకా ముగియలేదని, అతడి అస్థికల కోసం ప్రయత్నిస్తూనే ఉంటామని కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది.