Majid Khademi : యుద్ధం వేళ వరుసగా దేశ అగ్రనేతల్ని కోల్పోతున్న ఇరాన్కు మరో షాక్ తగిలింది. ఇరాన్ సైన్యం అయిన ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న మాజిద్ ఖదేమీ మరణించాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై సోమవారం అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో మాజిద్ ఖదేమి మరణించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. కొద్దిసేపటి క్రితం ఐఆర్జీసీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.
‘‘ఐఆర్జీసీలోని ఇంటెలిజెన్స్ విభాగానికి నాయకత్వం వహించిన మేజర్ జనరల్ మాజిద్ ఖదేమి అమరుడయ్యాడు. శతృవులైన అమెరికా-జియోనిస్టులు జరిపిన తీవ్రవాద దాడిలో బలమైన, విద్యావేత్త అయిన మాజిద్ సోమవారం మరణించారు’’ అని ఐఆర్జీసీ తన టెలిగ్రామ్ ఛానెల్లో పేర్కొంది. మాజిద్ ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ విభాగంతోపాటు, ఇంటెలిజెన్స్ ప్రొటెక్షన్ విభాగానికి కూడా నాయకత్వం వహించాడు. మాజిద్.. ఐఆర్జీసీలో చాలా కాలం నుంచి పని చేస్తున్నాడు. మొదట ఇంటెలిజెన్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్కు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత 2025 జూన్లో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతి అయ్యాడు. అంతకుముందు ఈ విభాగానికి నాయకత్వం వహించిన మొహమ్మద్ ఖజేమి.. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హతమయ్యాడు. దీంతో ఆయన స్థానంలో ఖదేమి బాధ్యతలు స్వీకరించాడు.
ఇరాన్కు సంబంధించి కీలక విభాగాల్లో ఉన్న అగ్ర నేతల్లో మాజిద్ చివరివాడు అయినట్లు తెలుస్తోంది. అంటే.. తాజా యుద్ధంలో ఇరాన్కు చెందిన సీనియర్ అగ్రనేతలు అందరూ మరణించినట్లే. ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేని సహా అలీ లారిజాని, ఎస్మాయిల్ ఖతిబ్, మొహమ్మద్ పాక్పోర్, గోలాంరెజా వంటి నేతలు మరణించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇరాన్-అమెరికా మధ్య చర్చల్లో ముందడుగు పడింది. ఇరు దేశాల ప్రతిపాదనల్ని మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు.. ఇరాన్, అమెరికాకు అందించాయి. వీటిపై ఆయా దేశాలు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే కాల్పుల విరమణ ఉండొచ్చు.