రియాద్: ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమిపై హత్యాయత్నం జరిగింది. రాజధాని బాగ్ధాద్లో అత్యంత భద్రత నడుమ ఉండే ప్రధాని ముస్తఫా నివాసంపై ఆదివారం తెల్లవారుజామున డ్రోన్ దాడి (drone attack) జరిగింది. అయితే ఈ హత్యాయత్నం విఫలమవడంతో ప్రధాని క్షేమంగా బయటపడ్డారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
డ్రోన్ దాడితో అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధాని ముస్తఫాను సురక్షిత ప్రాంతానికి తరలించింది. అత్యంత భద్రత నడుమ గ్రీన్ జోన్లో ఉండే ప్రధాని ఇంటిపై డ్రోన్తో దాడిజరగడంపై ఇరాక్ సైన్యం తీవ్రంగా పరిగనిస్తున్నది. అయితే తాను క్షేమంగానే ఉన్నానని, దేశ ప్రజలంతా శాంతియుతంగా, సంయమనంతో ఉండాలని ప్రధాని ముస్తఫా ట్వీట్చేశారు. కాగా, ఈ డ్రోన్ దాడికి తామే పాల్పడినట్లు ఏ ఒక్క గ్రూపు కూడా ప్రకటించలేదు.