Ali Mohammad Naeini : ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధంలో ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్జీసీ (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్)కు చెందిన అధికార ప్రతినిధి జనరల్ అలీ మొహమ్మద్ నైని మరణించాడు. ఈ విషయాన్ని ఇరాన్ అధికార మీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్ జరిపిన మిస్సైల్ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు శుక్రవారం తెలిపింది.
టెర్రరిస్టులు అయిన అమెరికా, జియోనిస్టులు జరిపిన దాడిలో తమ జనరల్ నైని వీరమరణం పొందారని ఐఆర్జీసీ ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనితోపాటు సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దోల్ రహిమ్ మౌసావి, రక్షణ శాఖ మంత్రి అజీజ్ నసీర్జాదే వంటి ఇతర కీలక నేతలు కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సంగతి తెలిసిందే. మరోవైపు తాము మాత్రం యుద్ధాన్ని ఆపేది లేదని ఇరాన్ ప్రకటించింది. శతృవు అలసిపోయే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని ఐఆర్జీసీ తెలిపింది. అమెరికాకు చేతనైతే యుద్ధనౌకల్ని పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మోహరించాలని గతంలో నైని అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు సవాల్ విసిరాడు.
తమ దగ్గర మిస్సైళ్లకు కొరత లేదని, యుద్ధం కొనసాగుతున్న సమయంలో కూడా తాము మిస్సైల్స్ తయారు చేశామని ఇటీవలే నైని అన్నాడు. అంతకుముందు అమెరికాకు చెందిన ఎఫ్-35 అనే యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇరాన్ విడుదల చేసింది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు కొనసాగిస్తూ ఉంది.