వాషింగ్టన్: ఎఫ్బీఐ(FBI) వార్నింగ్ ఇచ్చింది. గూఢచర్యం కోసం టెలిగ్రాం యాప్ను ఇరాన్ వాడుతున్నట్లు పేర్కొన్నది. ఆ మెసేజింగ్ యాప్ యూజర్లకు తెలియకుండానే స్పైయింగ్ మాల్వేర్ను ఎక్కిస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా టెలిగ్రాం యాప్ వాడుతున్న అసమ్మతివాదులకు, జర్నలిస్టులకు, విపక్ష నేతలకు మాల్వేర్ను ఇరాన్ పంపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా అమెరికన్ ఎఫ్బీఐ దీనిపై ఫ్లాష్ అలర్ట్ జారీ చేసింది. ఇరాన్ ఇంటెలిజన్స్ అండ్ సెక్యూర్టీ శాఖకు చెందిన హ్యాకర్లు టెలిగ్రాం ఫ్లాట్ఫామ్ను దుర్వినియోగం చేస్తున్నారని, టార్గెట్ డివైస్లకు మాల్వేర్ను ఎక్కిస్తున్నారని, యూజర్ల నుంచి డేటాను వెలికి తీసేందుకు ఇరాన్ ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ఎఫ్బీఐ పేర్కొన్నది.
ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడం, డేటా లీకేజీలకు పాల్పడడం లాంటి ఘటనలు జరుగుతున్నట్లు ఎఫ్బీఐ తన వార్నింగ్లో పేర్కొన్నది. సోషల్ ఇంజినీరింగ్ పద్ధతుల్లో హ్యాకర్లు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. నమ్మకమైన వ్యక్తులుగా కాంటాక్ట్ ఏర్పర్చుకుని, ఓ కామన్ ప్రోగ్రామ్ తరహాలో మాల్వేర్ను డౌన్లోడ్ చేయిస్తున్నారని, ఒకసారి ఆ మాల్వేర్ ఇన్స్టాల్ అయితే, ఆ యాక్సెస్తో ఫైళ్లను చోరీ చేస్తారని, ఆడియో రికార్డింగ్ చేస్తారని ఎఫ్బీఐ పేర్కొన్నది. 2023 నుంచి ఇరాన్ ఈ మాల్వేర్ యాక్షన్లో నిమగ్నమైనట్లు ఎఫ్బీఐ చెప్పింది.
తమ ప్రయోజనం దృష్ట్యా ఏ వ్యక్తినైనా ఇరాన్ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఎఫ్బీఐ తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫైల్స్ను డౌన్లోడ్ చేయరాదు అని, కనీస సైబర్ సెక్యూర్టీ చర్యలు పాఠించాలని అధికారులు కోరారు. అయితే ప్రస్తుతం అమెరికా చేపడుతున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి .. ఫ్లాష్ అలర్ట్ మెసేజ్కు ఏదైనా సంబంధం ఉందా లేదా అన్న విషయాన్ని అధికారులు నిర్ధారించలేదు.