Iran : ఒక పక్క ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధంలో పాల్గొంటూనే మరో పక్క తమ దేశంలో కార్యకలాపాల్ని ఇరాన్ సైలెంటుగా కానిచ్చేస్తోంది. తాజాగా ముగ్గురిని ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగా ఉరితీసింది. మృతుల్లో 19 ఏళ్ల రెజ్లర్ కూడా ఉన్నాడు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలపై ఈ ముగ్గురికి ఉరిశిక్ష వేసింది. ఈ ఘటనపై ఇరాన్ మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఈ ఉరిశిక్షను ఖండించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి.
గత ఏడాది డిసెంబర్ నుంచి ఇరాన్లో ప్రజల్లో తిరుగుబాటు మొదలైన సంగతి తెలిసిందే. అక్కడి ధరల పెరుగుదల, నిరుద్యోగం, కరెన్సీ విలువ పడిపోవడం వంటి కారణాలతో చాలా మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భద్రతా బలగాలు, పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆందోళనల్ని అణచివేసేందుకు పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. నిరసనకారులు పలువురు పోలీసులపై దాడి చేయగా, కొందరు మరణించారు. కొన్ని ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పలువురు నిరసనకారుల్ని ఇరాన్ ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంది. వారిపై విచారణ సాగుతోంది. ఇందులో ముగ్గురు యువకులకు కోర్టు మరణశిక్ష విధించింది. 19 ఏళ్ల రెజ్లర్ అయిన సలేహ్ మొహమ్మది, సయీద్ దావోది, మెహ్ది ఘసెమి అనే ముగ్గురు వ్యక్తులు ఘర్షణల సందర్భంగా ఇద్దరు పోలీసుల్ని చంపినట్లు ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వానికి ఎదురుతిరగడం అంటే దేవుడిని ఎదిరించినట్లే అని అక్కడి ప్రభుత్వం వారిపై కఠిన శిక్షలకు సిద్ధమైంది.
ముగ్గురూ హత్యా నేరానికి పాల్పడ్డందుకుగాను స్థానిక కోర్టు మరణ శిక్ష విధించింది. దీంతో ఈ ముగ్గురిని గురువారం క్వామ్ పట్టణంలో కొందరు ప్రజల సమక్షంలో బహిరంగంగా ఉరితీశారు. అయితే, ఈ ఘటనపై ఇరాన్ మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుల్ని హింసించి, వారితో బలవంతంగా నేరాన్ని అంగీకరించేలా చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఘర్షణలు మొదలైన తర్వాత ఇటీవలి కాలంలో అమలు చేసిన మొదటి ఉరిశిక్ష ఇదని అక్కడి వారు చెబుతున్నారు.