Iran Embassy : అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో యూకే (United Kingdom) లోని ఇరాన్ దౌత్య కార్యాలయం (Iran Embassy) చేసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) తో జరుగుతున్న యుద్ధంలో శత్రువుకు తల వంచొద్దని, దేశాన్ని వారికి అప్పగించే బదులు మనమంతా ప్రాణాలు అర్పిద్దామని యూకేలో నివసిస్తున్న ఇరాన్ పౌరులకు దౌత్యకార్యాలయం పిలుపునిచ్చింది. బలిదానానికి సిద్ధంగా ఉన్నవారు తమను సంప్రదించాలని కోరింది. ఈ ఎంబసీ పోస్టును నెటిజన్లు తీవ్రంగా ఖండించారు.
ఇరాన్ దౌత్య కార్యాలయం పోస్ట్ ప్రజలను రెచ్చగొట్టేలా ఉందంటూ యూకే అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి పోస్ట్ చేసినందుకు ఆ దేశ రాయబారి సయ్యద్ అలీ మౌసావినికి సమన్లు జారీచేశారు. అయితే ఇరాన్ రాయబార కార్యాలయం తమ పోస్ట్ను సమర్థించుకుంది. ఈ ప్రచారం దేశభక్తికి, దేశంపై విధేయతకు సంబంధించినదని, హింసను ప్రోత్సహిస్తున్నట్లు కాదని పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరానీయులు ఎల్లప్పుడూ తమ మాతృభూమి పరిరక్షణకు ముందుంటారని తెలిపింది.
కాగా యుద్ధంలో ప్రాణత్యాగం చేయడానికి తనతో సహా ఇరాన్ పౌరులు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంబసీ పోస్ట్ ఆందోళన రేపుతున్నది.