టెహ్రాన్: పాలస్తీనాలోని గాజాకు చెందిన హమాస్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి పోరు మొదలైంది. (Israel-Hamas conflict) ఈ నేపథ్యంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) అత్యవసర సమావేశానికి ఇరాన్ పిలుపునిచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కనానీ సోమవారం ఈ విషయం తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో ప్రాంతీయ పరిణామాలపై చర్చించేందుకు ఓఐసీ అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. అలాగే ఇజ్రాయెల్పై హమాస్ దాడుల వెనుక ఇరాన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. హమాస్ దాడులు, అపహరణలతో ఇరాన్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ను బెదిరించేందుకు ఎవరైనా ఏదైనా మూర్ఖపు చర్యకు పాల్పడితే వినాశకార ప్రతిస్పందనతో ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు.
కాగా, ఇజ్రాయెల్పై హమాస్ తాజా దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. అయితే ఇరాన్, హమాస్ మధ్య చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. మరోవైపు ఇరాన్ చాలా కాలంగా పాలస్తీనాలోని మిలిటెంట్ గ్రూపులకు మద్దతిస్తున్నది. అలాగే గాజాతోపాటు లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాక్లోని మిలిటెంట్ గ్రూపులకు అండగా ఉంటున్న ఇరాన్ ఆయా దేశాల్లో తన ఉనికిని చాటుతున్నది.