టెహ్రాన్: హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా ఇరాన్లో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మహసా అమిని అనే ఓ మహిళ పోలీసుల దాడిలో మృతిచెందిన తర్వాత ఆ దేశంలో ఆందోళనలు మరింత ఊపందుకున్నాయి. గత ఆరు రోజుల నుంచి జరుగుతున్న నిరసనల్లో ఇప్పటి వరకు 9 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్పై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ను బ్లాక్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆ సోషల్ మీడియాను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో ఇరాన్లో ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్ ఫ్లాట్ఫామ్లను బ్లాక్ చేశారు. ఇక ఇప్పుడు తాజా నిరసనలతో ఇన్స్టా, వాట్సాప్లను కూడా ఆపేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.