కాబూల్: కొన్నాళ్ల కిందట ఓ ఆసక్తికరమైన వార్త వచ్చింది తెలుసు కదా. ఎప్పుడో 13 ఏళ్ల కిందట సెనేటర్గా ఉన్న ఇప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను మంచు తుఫాను నుంచి కాపాడిన ఓ వ్యక్తి.. తనను ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలించాలని వైట్హౌజ్ను కోరాడు. అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్థాన్లో ఉన్న సమయంలో అమన్ ఖలీలి అనే ఆ వ్యక్తి వారికి సాయం చేశాడు. ఓసారి ఆఫ్ఘనిస్థాన్ వచ్చిన అప్పటి సెనేటర్ బైడెన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంచు తుఫానులో చిక్కుకుంటే అమెరికా సేనలతో కలిసి వెళ్లి ఖలీలి కాపాడాడు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ తనను, తన కుటుంబాన్ని తాలిబన్ల రాజ్యం నుంచి సురక్షితంగా తరలించాలని వేడుకున్నాడు. దీనికి అప్పట్లో వైట్హౌజ్ కూడా సానుకూలంగా స్పందించింది. మొత్తానికి ఇప్పుడు ఖలీలిని, అతని కుటుంబాన్ని ఆఫ్ఘనిస్థాన్ నుంచి సురక్షితంగా పాకిస్థాన్కు తరలించారు.
ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. అమెరికా ప్రభుత్వంతోపాటు ఎంతో మంది కృషి కారణంగా అతన్ని సురక్షితంగా అక్కడి నుంచి తరలించినట్లు తెలిపారు. ఆఫ్ఘన్, ఇరాక్లలో అమెరికా సేనలకు సాయం చేసిన వారికి ప్రత్యేకంగా యూఎస్ స్పెషల్ ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేస్తున్నారు. అయితే ఈ వీసా పొందడానికి ప్రయత్నించి విఫలమైన ఖలీలి.. తనకు సాయం చేయాలని అమెరికాను కోరాడు. మొత్తానికి ఇప్పటికి అతను ఎలాగోలా ఆఫ్ఘనిస్థాన్ నుంచి బయటపడ్డాడు. అయితే అతనికి స్పెషల్ ఇమ్మిగ్రెంట్ వీసా దొరికిందా లేదంటే అతడు అమెరికా వెళ్తాడా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.2008 నుంచి ఇప్పటి వరకూ 70 వేల మంది ఆఫ్ఘన్లు ఈ స్పెషల్ వీసాపై అమెరికాలో అడుగుపెట్టారు.