Indus water treaty | సింధు జలాల ఒప్పందానికి సవరణలు తీసుకొచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది. అయితే, దీని నుంచి తప్పించుకునేందుకు పాక్ దారులు వెతుక్కుంటున్నది. పాకిస్తాన్ ఏకపక్షం నిర్నయాల కారణంగా రెండు దేశాల మధ్య చేసుకున్న ఒప్పందంలో తేడాలు వస్తున్నాయి. దీనిపై పాకిస్తాన్కు భారత్ నోటీసు జారీ చేసింది. చర్చలకు 90 రోజుల సమయం ఇస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నది. సింధు నదీ జలాల ఒప్పందానికి భారతదేశం సవరణ కోరడం ఇది తొలిసారి.
సెప్టెంబర్ 1960 నాటి సింధు జలాల ఒప్పందానికి భారత్ సవరణలు కోరుతున్నది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు ఇండియా నోటీసు జారీ చేసింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి భారత్ సదా కట్టుబడి ఉన్నది. అయితే పాకిస్తాన్ ఏకపక్ష నిర్ణయం కారణంగా ఈ ఒప్పందం దెబ్బతింటున్నది. నిజానికి సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ మార్చాలని కోరుకుంటున్నది. అయితే పాకిస్తాన్ దానిని తప్పించుకుంటున్నది. భారత్తో నేరుగా మాట్లాడకుండా పదే పదే ప్రపంచ బ్యాంకును ఆశ్రయిస్తున్నది. దాంతో సవరణలు తీసుకువద్దామంటూ భారత్ ప్రతిపాదనలు చేసింది. మెటీరియల్ ఉల్లంఘనలను సరిదిద్దుకునేందుకు 90 రోజుల్లో రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుపుకునేందుకు పాకిస్తాన్కు భారత్ అవకాశమిచ్చింది.
పలు నివేదికల ప్రకారం, పాకిస్తాన్ పదేపదే చెప్పే మాటలపై ప్రపంచ బ్యాంక్ ఇటీవల తటస్థ నిపుణుడు, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఐడబ్ల్యూటీ నిబంధన ప్రకారం ఈ రెండు చర్యలు ఏకకాలంలో జరగవు. భారత్కు చెందిన కిషన్గంగా, రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ల (హెచ్ఈపీ)పై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు తటస్థ నిపుణుడిని నియమించాలని 2015 లో పాకిస్తాన్ డిమాండ్ చేసింది. 2016 లో పాకిస్తాన్ ఏకపక్షంగా ఈ డిమాండ్ను ఉపసంహరించుకున్నది. ఇది జరిగిన వెంటనే పాకిస్తాన్ ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్లింది. ఈ అభ్యంతరాలను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తేల్చాలని పాక్ కోరింది. ఈ విషయంపై పాక్తో మాట్లాడేందుకు భారత్ చాలాసార్లు ప్రయత్నించింది. అయితే, ప్రతిసారీ పాకిస్తాన్ నిరాకరిస్తూ వచ్చింది. శాశ్వత ఇండస్ కమిషన్లో 2017 – 2022 మధ్య భారతదేశం ఈ సమస్యను 5 సార్లు లేవనెత్తింది. అయినప్పటికీ పరిష్కారం కనుగొనలేదు.