Chattogram : బంగ్లాదేశ్లో భారత దౌత్యవేత్త అనుమానాస్పదంగా మరణించాడు. మంగళవారం అతడి మృతదేహాన్ని దౌత్య కార్యాలయ ప్రాంగణంలో గుర్తించారు. ఈ ఘటన బంగ్లాదేశ్, చట్టోగ్రామ్లో జరిగింది. మృతుడిని నరేన్ ధర్గా గుర్తించారు. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఛట్టోగ్రామమ్లో నరేన్ ధర్ అనే అధికారిక భారత దౌత్య కార్యాలయంలో అసిస్టెంట్ ప్రోటోకాల్ ఆఫీసర్గా పని చేస్తున్నాడు.
మంగళవారం ఉదయం అతడి మృతదేహాన్ని ఓల్డ్ వీసా సెంటర్ బిల్డింగ్ పరిధిలో గుర్తించారు. సెకండ్ ఫ్లోర్లోన బాత్రూమ్ డోర్ వద్ద నరేన్ మృతదేహం పడి ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దౌత్య అధికారి కాబట్టి, అదనపు ప్రోటోకాల్ పాటిస్తూ అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బంగ్లాదేశ్ పోలీసు అధికారులు తెలిపారు. నరేన్ మృతదేహాన్ని ఛట్టోగ్రామ్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం పంపించినట్లు సిటీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అమినూర్ రషీద్ తెలిపారు. అతడి మృతికి గల కారణాలు తెలియలేదన్నారు.
కార్డియాక్ అరెస్ట్ కారణంగానే నరేన్ మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే అతడి మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని రషీద్ తెలిపారు. అలాగే, ఆయన మృతి ఘటనలో అనుమానాస్పదంగా ఏమీ అనిపించలేదని పోలీసులు చెప్పారు. అయినప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామన్నారు. నరేన్.. ఇండియాలోని చండీగఢ్కు చెందినట్లుగా తెలుస్తోంది. ఈ అంశం గురించి ఢాకాలోని భారత రాయబార కార్యాలయం నుంచి ప్రకటన రావాల్సి ఉంది.