వాంకోవర్: కెనడాలో గుర్తుతెలియని దుండగులు ఓ భారతీయ విద్యార్థిని కాల్చి చంపారు. దక్షిణ వాంకోవర్లో చిరాగ్ అంటిల్ (24) అనే విద్యార్థి దుండగుల చేతిలో హత్యకు గురైనట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు. తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిందని ఘటనాస్థలం నుంచి తమకు సమాచారం వచ్చిందని, దీంతో అక్కడికి వెళ్లగా కారులో విగత జీవిగా పడున్న చిరాగ్ అంటిల్ కనిపించాడని వాంకోవర్ పోలీసులు పేర్కొన్నారు. చిరాగ్ ఉన్నత చదువుల నిమిత్తం 2022 సెప్టెంబర్లో కెనడా వెళ్లారు. యూనివర్సిటీ కెనడా వెస్ట్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్న అతడికి కొద్ది రోజుల క్రితమే వర్క్ పర్మిట్ కూడా వచ్చింది. ‘శనివారం రాత్రి తూర్పు 55వ అవెన్యూ నుంచి తుపాకీ కాల్పులు విన్నానని మాకు కాల్ వచ్చింది. ఇప్పటివరకూ ఎవర్నీ అరెస్టు చేయలేదు. కేసు దర్యాప్తులో ఉంది’ అని పోలీసులు తెలిపారు.