లండన్: భారత సంతతి విద్యార్థిని బ్రిటన్లో హత్యకు గురైంది. లండన్లోని విద్యార్థి వసతి గృహంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసుకు సంబంధించి ట్యునీషియా జాతీయుడ్ని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత సంతతికి చెందిన 19 ఏండ్ల సబితా తన్వానీ బ్రిటన్ పౌరురాలు. లండన్లోని క్లర్కెన్వెల్ ప్రాంతంలోని అర్బర్ హౌస్ విద్యార్థి ఫ్లాట్లో శనివారం ఆమె కత్తి గాయాలతో కనిపించారు. గొంతు వద్ద తీవ్ర కత్తి గాయాలైన ఆమె మరణించినట్లు పోలీసులు ప్రకటించారు.
కాగా, ట్యునీషియా జాతీయుడైన 22 ఏండ్ల మహర్ మరూఫీ, సబితా మధ్య సంబంధమున్నదని లండన్ పోలీసులు తెలిపారు. స్టూడెంట్ కాని అతడ్ని ఆమె హత్యకు గురైన క్లర్కెన్వెల్ ప్రాంతంలో ఆదివారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అయితే సబితాను మహర్ ఎందుకు హత్య చేశాడు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు సబితా ఆకస్మిక మరణంపై ఆమె కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. లండన్ సిటీ యూనివర్సిటీలో సైకాలజీ చదువుతున్న ఆమెను ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమగా చూస్తారని తెలిపారు. ఆమె అందరి బాగోగుల గురించి ఆలోచిస్తుందని, ప్రతి ఒక్కరికి సహాయం చేయడం ఆమె మిషన్ అని చెప్పారు. చిన్న వయసులోనే ఎంతో మందికి ఆమె సహాయం చేసిందని గుర్తు చేసుకున్నారు. సబితా హత్య మహిళల భద్రతకు ఒక గుణపాఠం కావాలని, మరెవరూ కూడా అలా మరణించకూడదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.