వాషింగ్టన్: అమెరికాలోని హ్యూస్టన్లో ఈ నెల 5న రాప్ స్టార్ ట్రావిస్ స్కాట్ ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన భారత సంతతి విద్యార్థిని, భారతీ షహానీ చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 9కి చేరింది. ఈ దుర్ఘటనలో 22 ఏండ్ల భారతి బ్రెయిన్కు గాయమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాటి నుంచి వెంటిలేటర్పై ఉన్న ఆమె బుధవారం రాత్రి మరణించినట్లు చెప్పారు.
భారతి, ఆమె సోదరి నమ్రతా షహానీ, కజిన్ బెల్లానీ కలిసి ట్రావిస్ స్కాట్ సంగీత కచేరీకి వెళ్లినట్లు ఆమె కుటుంబం తెలిపింది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో మిగతా ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, భారతి తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ‘ఆమె మాకు దేవత లాంటిది’ అని భారతి తండ్రి సన్నీ అన్నారు. ‘భారతి అంటే మాకు ఎంతో ప్రేమ’ అంటూ ఆమె తల్లి కరిష్మా కన్నీటి పర్యంతమయ్యారు. ‘స్నేహితులు, తల్లిదండ్రులు, కుటుంబం, ఆమె కుక్క నీలం.. ఇలా ఆమె ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంది. మా కుటుంబానికి వెన్నెముక భారతి’ అని పేర్కొన్నారు. మ్యూజిక్ షోలకు పెద్దగా వెళ్లని భారతి, ఆ రోజు వెళ్లి తమకు దూరమైందని ఆమె వాపోయారు.
కాగా, భారతీ షహానీ భారతీయ సంతతికి చెందిన మొదటి తరం అమెరికన్. టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువుతున్న ఆమె త్వరలో పట్టభద్రురాలు కానున్నది. ఈ నేపథ్యంలో తమ విద్యార్థిని భారతి మరణం పట్ల ఆ యూనివర్సిటీ అధికారులు ఆమె కుటుంబానికి తమ సంతాపాన్ని తెలిపారు.
మరోవైపు ట్రావిస్ స్కాట్ మ్యూజిక్ కచేరీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన 9 మంది, 14 నుంచి 27 ఏండ్ల వయసు వారేనని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9 ఏండ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు.