Rishi Sunak | బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా బోరిస్కు వ్యతిరేకంగా బ్రిటన్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవాలని జాన్సన్కు డిమాండ్లు వస్తున్నాయి. బోరిస్కు వ్యతిరేకంగా 40 మందికి పైగా మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే తప్పని పరిస్థితుల్లో ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు జాన్సన్ ప్రకటించారు. కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు బోరిస్ ఆ పదవిలో కొనసాగనున్నారు.
అయితే బ్రిటన్ కొత్త ప్రధాని ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఆ పదవి రేసులో రిషి సునక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైతే.. యూకే పీఎంగా ఎన్నికైన తొలి భారతీయ సంతతి వ్యక్తి అవుతారు. 42 ఏండ్ల రిషి సునక్ను 2020, ఫిబ్రవరిలో బోరిస్ జాన్సన్ తన కేబినెట్లో ఆర్థిక మంత్రిగా నియమించిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ సమయంలో ప్రజలు, ఉద్యోగులకు అండగా ఉండేందుకు అనేక పథకాలను రిషి ప్రకటించారు. ఆ సమయంలో ఆయన పాపులర్ అయ్యారు. బ్రిటన్ ప్రజల్లో మంచి ఆదరణ పొందారు కూడా. అలా బ్రిటన్ ప్రజల్లో ఆయనకు మంచి పేరుంది. ఇక రిషి సునక్ గ్రాండ్ పేరెంట్స్ పంజాబ్ పూర్వీకులు. ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమార్తె అక్షత మూర్తిని సునక్ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కాలిఫోర్నియాలో చదువుకున్నప్పుడు ఏర్పడిన పరిచయం, వివాహానికి దారి తీసింది.
ప్రధాని బోరిస్ జాన్సన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆర్థికమంత్రి పదవికి రిషి సునక్ మంగళవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతకు ముందు ఆరోగ్య శాఖ మంత్రి పదవికి సాజిద్ జావిద్ కూడా రాజీనామా చేశారు. వరుస కుంభకోణాలు, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు, నిందితులకు రక్షణగా నిలబడటం వంటి చర్యలను వ్యతిరేకిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సునక్, జావిద్ వెల్లడించారు. ‘తాము ఎన్నుకున్న ప్రభుత్వం సమర్థంగా, నమ్మకంగా పనిచేయాలని కోరుకోవడం ప్రజల హక్కు. అయితే, అలా జరుగడంలేదు. ప్రభుత్వాన్ని వీడటం బాధగా ఉంది. అయితే భిన్నమైన మనస్తత్వాలు ఉన్నప్పుడు కలిసి కొనసాగలేము’ అని సునక్ పేర్కొన్నారు.